ఎంత ప్రయత్నించినా...ఉద్యోగం రాలేదని బిటెక్ చదివిన నిరుద్యోగి ఆత్మహత్య
విజయవాడ:రాష్ట్రంలో మరో నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడంలేదని నిరాశకు గురైన విజయవాడ యువకుడు దుర్గారావు ఒంటిపై పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు.
ఒళ్లంతా కాలిపోవడంతో తీవ్రంగా గాయపడిన దుర్గారావును స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. బీటెక్ పూర్తి చేసిన దుర్గారావు ఉదోగ్యం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని నెలలుగా అనేక ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అయితే అతడికి ఎక్కడా ఉద్యోగం లభించలేదు. రెండు రోజుల క్రితం కూడా ఒక ఇంటర్వ్యూ వెళ్లగా అక్కడ కూడా నిరాశే ఎదురవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు.
ఈ క్రమంలో తీవ్ర మానసిక వేదనతో దుర్గారావు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు. ఆ క్రమంలో ఒళ్లు తీవ్రంగా కాలిపోవడంతో ఆర్తనాదాలు చేస్తున్న దుర్గారావును స్థానికులు ఆస్పత్రికి తరలించగా 90 శాతం కాలిన గాయాలైన దుర్గారావు చికిత్సపొందుతూ కన్నుమూశాడు.
ఏడాదిలో వ్యవధిలోనే నలుగురు నిరుద్యోగులు లేఖలు రాసి మృతి చెందగా తాజాగా దుర్గారావు బలవన్మరణానికి పాల్పడటం కలచివేస్తోంది. అయితే ఉద్యోగం రానంత మాత్రాన జీవితం లేదని భావించవద్దని, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనే ముందుగా ఏదో ఒక ఉపాధి పొందేందుకు ప్రయత్నించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.