అనంతలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య: ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం..
అనంతపురం జిల్లా పామిడిలో ఓ బీటెక్ విద్యార్థి బుధవారం రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
పామిడి: అనంతపురం జిల్లా పామిడిలో ఓ బీటెక్ విద్యార్థి బుధవారం రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ చదువు కష్టంగా అనిపించినందువల్లే అతను ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు భావిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. దూదేకుల హన్నూర్ సాబ్, షబీనాకౌసర్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు డి.షోయబ్ అక్మల్(18) తాడిపత్రి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్(ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
అయితే ఎంత చదివినా బీటెక్ సబ్జెక్స్ అతనికి అర్థం కాకపోవడంతో.. ఇక ఇంజనీరింగ్ పూర్తి చేయడం కష్టమేనని భావించాడు. ఎప్పుడూ ఒంటరిగా బాధపడుతుండేవాడు. తిండీ తిప్పల గురించి కూడా పట్టించుకోవడం మానేశాడు. తల్లిదండ్రులు వారించినా.. ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఇటీవల దసరా సెలవుల నిమిత్తం పామిడిలోని తమ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి అక్మల్ మానసకింగా బాధపడుతున్నట్లు కనిపించడంతో.. కుమారుడిపై తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. అక్మల్ ఆరోగ్యం కుదుటపడాలని బుధవారం నార్పల మండం గూగూడు కుళ్లాయిస్వామి దర్శనానికి వెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.
ఇదే క్రమంలో బుధవారం ఉదయం ప్రతీరోజు లాగే అక్మల్ వాకింగ్కు వెళ్లాడు. కొద్దిసేపటికే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. కుమారుడి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. 'నాయనా... అప్పుడే నీకు నూరేళ్లు నిండెనా... ఎంత పనిచేశావు నాయనా..' అంటూ రోధించారు. దీంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.