దీపావళికి ఇంటికొస్తానమ్మా అన్నాడు: ఇంతలోనే శవమై.., తల్లి గుండె పగిలింది..
భారీ అలల తాకిడికి శ్రావణ్ కుమార్ ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు.
నెల్లూరు: నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన గిండి శ్రావణ్ కుమార్(18) చెన్నై మెరీనా బీచ్లో మృత్యువాత పడ్డాడు. దీపావళికి ఇంటికొస్తానమ్మా అని చెప్పిన కొడుకు.. శవమై రావడంతో ఆ తల్లి గుండె పగిలింది.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని జయ ఇంజినీరింగ్ కళాశాలలో శ్రావణ్ కుమార్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దీపావళి టపాసులు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నామని చెప్పి ఆదివారం ఐదుగురు విద్యార్థులతో కలిసి శ్రావణ్ బయటకు వెళ్లాడు.
అనంతరం విద్యార్థులంతా కలిసి బీచ్లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. అయితే భారీ అలల తాకిడికి శ్రావణ్ కుమార్ ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు.శ్రావణ్ మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం నాయుడుపేటలోని నివాసానికి తీసుకువచ్చారు. తమ్ముడు మృతిచెందినట్లు తెలుసుకున్న శ్రావణ్ అన్న సాయికుమార్ అమెరికా నుంచి హుటాహుటిన బయలుదేరాడు.
శ్రావణ్కుమార్ మృతిపై కళాశాల యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, శ్రావణ్ స్నేహితుడు ఫోన్ చేసి చెప్పేదాకా తెలియలేదని అతని కుటుంబ సభ్యులు వాపోయారు.