ఫోన్ కాల్స్, పోస్ట్ మార్టం కీలకం! బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న కేసులో బిహారీ లెక్చరర్ హస్తం?
విశాఖపట్నం: బీటెక్ విద్యార్థిని జోత్స్న అనుమానాస్పద మృతి కేసు ఓ అడుగు ముందుకు, రెండడగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. కేసును ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైనటువంటి ఆధారాలేవీ పోలీసుల చేతికి చిక్కలేదు. ఈ కేసులో ఎలాంటి లీడ్ దొరక్కపోవడంతో పోలీసులు ఇక పోస్ట్ మార్టం నివేదికపై దృష్టి కేంద్రీకరించారు. పోస్ట్ మార్టమ్ నివేదిక అందిన తరువాతే ఆమె మరణం వెనుక ఉన్న అసలు కారణమేంటనే విషయాన్ని నిర్ధారించగలుగుతామనే స్థిర నిర్ణయానికి పోలీసులు వచ్చినట్లు చెబుతున్నారు. జ్యోత్స్న మృతి కేసులో అంకుర్ అనే ఓ లెక్చరర్ ను అదుపులోకి తీసుకున్నారు. బిహార్ కు చెందిన అంకుర్ విశాఖలో నివసిస్తున్నారు. ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఆయన లెక్చరర్ గా పనిచేస్తున్నారు. జ్యోత్స్న మృతదేహాన్ని పోలీసులు అంకుర్ నివాసంలో ఫ్యాన్ కు వేలాడుతున్న స్థితిలో స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
కాల్ డేటా విశ్లేషణ..
అంకుర్, జ్యోత్స్నల సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ సాగి ఉంటుందనే విషయంపై ఆరా తీస్తున్నారు. వారిద్దరి మధ్య ఎప్పటి పరిచయం ఉందనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. మల్కాపురం జయేంద్ర కాలనీలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోన్న జ్యోత్స్న.. అక్కయ్యపాలెం శాంతిపురంలోని కట్టా ఎన్ క్లేవ్ లో నివసిస్తోన్న అంకుర్ ప్లాట్ తరచూ వెళ్తుండేదని దర్యాప్తులో తేలింది. ఎప్పటి నుంచి ఆమె అంకుర్ ప్లాట్ రాకపోకలు సాగిస్తుందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాల్ డేటాను విశ్లేషిస్తే.. కీలక సమాచారం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
జయేంద్ర కాలనీలో నివసిస్తోన్న దేవ్ కర్, మాలతిల కుమార్తె జ్యోత్స్న. బీటెక్ విద్యార్థిని. స్థానిక బుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకునే జ్యోత్స్న ఇదివరకు ఐఐటీ పరీక్షలను రాశారు. దీనికోసం ద్వారకానగర్ లోని ఐఐటీ కోచింగ్ ఇన్ స్టిట్యూట్ కు వెళ్లేవారు. అక్కడే ఆమెకు అంకుర్ తో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. కోచింగ్ ముగిసిన తరువాత కూడా ఆమె అంకుర్ తో ఫోన్ ద్వారా సంభాషిస్తుండేదని పోలీసులు అనుమానిస్తున్నారు. సబ్జెక్ట్స్ లో డౌట్లు ఏవైనా ఉంటే కట్టా ఎన్ క్లేవ్ లోని అంకుర్ ప్లాట్ కు కూడా తరచూ వెళ్తుండే వారని స్థానికులు చెబుతున్నారు. మంగళవారం కూడా ఆమె ఎప్పట్లాగే అంకుర్ ప్లాట్ కు వెళ్లి ఉండొచ్చని, ఆ తరువాతే ఆమె నిర్జీవంగా సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతున్న స్థితిలో కనిపించారని పోలీసులు చెబుతున్నారు.
తండ్రి బస్ స్టాప్ లో చేసినా..
కళాశాలకు వెళ్లడానికి జ్యోత్స్న తండ్రి దేవ్ కర్ ఆమెను మల్కాపురం బస్ స్టాప్ లో బైక్ పై డ్రాప్ చేశారు. అక్కడి నుంచి జ్యోత్స్న కాలేజీకి వెళ్లలేదు. నేరుగా ఆమె అంకుర్ ప్లాట్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించారు. మల్కాపురం బస్ స్టాప్ నుంచి జ్యోత్స్న ఒంటరిగా వెళ్లారా? లేక అంకుర్ ఆమెను తీసుకెళ్లాడా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. దీనికోసం పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అంకుర్ వాదనేంటి?
జ్యోత్స్న తన ప్లాట్ కు వెళ్లిన విషయం తనకు ఏ మాత్రం తెలియదని అంకుర్ చెబుతున్నారు. ఆమె తన ప్లాట్ కు వెళ్లిన సమయంలో తాను కాలేజీలో ఉన్నానని అంటున్నారు. ప్లాట్ తాళాలు కూడా తన వద్దే ఉన్నాయని, ఆమె లోనికి ఎలా వెళ్లిందనే విషయంపై తనకుతెలియదని అంటున్నారు. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. తనను ప్రేమిస్తున్నానంటూ జ్యోత్స్న తన వెంట పడిందని, ఆమె ప్రేమను తాను నిరాకరించానని చెబుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రేమించకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని కూడా పలుమార్లు బెదిరించినట్లు అంకుర్ చెబుతున్నారట. పలుమార్లు విచారించినప్పటికీ.. అంకుర్ ఇదే విషయాన్ని చెబుతున్నారని, దీనితో మరో కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. పోస్ట్ మార్టమ్ నివేదిక, కాల్ డేటాను విశ్లేషిస్తే.. కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
ఆత్మహత్య కాదు.. హత్యే!
జ్యోత్స్న తల్లిదండ్రులు తమ కుమార్తెను హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. బీటెక్ విద్యార్థిని జ్యోత్స్నది ముమ్మాటికీ హత్యేనని మహిళ చేతన కార్యదర్శి కె.పద్మ ఆరోపించారు. మహిళా సంఘాల ప్రతినిధులు మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళన చేపట్టాయి. పద్మ మాట్లాడుతూ విద్యార్థిని మృతిపై హత్య కోణంలో పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లెక్చరర్ బెడ్ రూమ్లో విద్యార్థిని మృతి చెందిందంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.ఎన్.మాధవి, ఆర్.విమల మాట్లాడుతూ నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టంలో సమగ్ర నివేదిక ఇవ్వాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.