ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు..!జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి టైం ఉందన్న బుచ్చయ్య చౌదరి..!!
రాజమండ్రి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. ఎన్టీఆర్ కష్టకాలంలో కూడా వెన్నంటి నడిచిన నాయకుడు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ ను ఎప్పుడూ పొగడ్తలతో ముంచెత్తుతుంటారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు వర్గంలో చేరిపోయి పార్టీ గాడి తప్పుతున్నప్పుడల్లా తన మాటల తూటాలతో హెచ్చరికలు చేస్తూ పార్టీని తనదైన శైలిలో ట్రాక్ మీదకు తెస్తుంటారు బుచ్చయ్య చౌదరి. తాజాగా సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ కలకలం సృష్టిస్తోంది. ఎన్నికలకు ముందే పార్టీలో జరుగుతున్న అవకతవకలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాహాటంగాను, పార్టీ వేదికలపైనా అంతర్గత సమీక్షల్లో చంద్రబాబును పదేపదే హెచ్చరించారు. పక్క పార్టీల వారిని చేర్చుకోవడం అక్కడితో ఆగకుండా పార్టీ జెండా భుజాన మోస్తున్న వారిని వదిలి ఫిరాయింపు దారులను అందలం ఎక్కించడం వంటి చర్యలపై అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు బుచ్చయ్య చౌదరి.
కానీ ఇవన్నీ అరణ్య రోదనే అయ్యాయి. మంత్రి పదవికోసమే గోరంట్ల ఇవన్నీ చేస్తున్నారంటూ ఆయన ప్రత్యర్ధులు కారాలు మిరియాలు నూరేవారు. చివరికి పోలింగ్ తరువాత జరిగిన సమీక్షలో సైతం గోరంట్ల తాను గెలుస్తున్నా అంటూ నివేదిక ఇచ్చినప్పుడు వెటకారపు వ్యాఖ్యలతో కోటరీ మాటలు విని చిన్నబుచ్చారు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న గోరంట్ల కడుపులో వున్నది కక్కేశారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యులు ఎవరు..? ఎవరు పార్టీలో బాధ్యత తీసుకోవాలి..? పాలిట్ బ్యూరో సభ్యులా..?మన నాయకుడా..? పార్టీ జండా మోసే మన కార్యకర్త..? ఈవీఎం లా..? జన్మభూమి కమిటీలా..? ఎమ్యెల్యేలా..? మంత్రులా..? అసలు ఆత్మ విమర్శ ఎక్కడా అంటూ నిప్పులు చెరిగారు. గోరంట్ల పెట్టిన పోస్టింగ్ తో ఇప్పుడు పసుపు దళం తమకోణంలో పరాజయాన్ని విశ్లేషిస్తున్నారు. ఇలా కర్ణుడి చావుకి కారణాల్లా టిడిపి ఓటమికి దారితీసిన పరిస్థితులపై గోరంట్ల సొంత పార్టీకే ఆత్మవిమర్శ పేరుతో చురకలంటించారని తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతోంది. ఇర వైసీపి ప్రభుత్వం గురించి స్పందిస్తూ జగన్ విధానాలను విమర్శించేందకు సమయం పడుతుందని చెప్పుకొచ్చారు బుచ్చయ్య చౌదరి.