ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ పాత ఏడుపులేనా: దమ్ముంటే రాజధానిలో చర్చ పెట్టండని బుద్దా సవాల్
ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన తర్వాత అధికార,ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది.రాజధాని అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని గత కొంతకాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ నేతలపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా మూడు రాజధానులు ప్రకటన నేపథ్యంలోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఇన్సైడర్ ట్రేడింగ్ పై ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. అమరావతిలో రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టు, ఇంకా ఏదయినా ప్రకటనకు ముందే తన వాళ్లకు సమాచారం ఇచ్చి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇన్ సైడర్ ట్రేడింగుకు పాల్పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
అయ్యా విజయసాయి రెడ్డి గారూ.. అధికారంలోకి వచ్చిన 7 నెలల తరువాత కూడా పాత ఏడుపులేనా? అంటూ ప్రశ్నించిన బుద్దా వెంకన్న, ఇప్పటికే అనేక మార్లు నిరూపించండి అడిగామని పేర్కొన్నారు. అమరావతిలో వేల ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అని ట్వీట్లు చేయడం మానండని హితవు పలికారు . డైరెక్టుగా రాజధాని ప్రాంతంలోనే రాజధాని రైతుల ముందే తేల్చుకుందాం రండి అంటూ సవాల్ చేశారు బుద్దా వెంకన్న .
సమయం తేదీ మీరే నిర్ణయించండి అని,తాము ఎప్పుడైనా రెడీ అని విమర్శలు చేసిన విజయసాయికి స్పష్టం చేశారు.మీకు, జగన్ గారికి దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలు ఉంటే బయట పెట్టండి అంటూ సవాల్ విసిరారు.ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు విజయ సాయి రెడ్డి టిడిపి పై బురద జల్లడం ఏమి బాగోలేదని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. బురదజల్లడమే మీ పని అనుకుంటే మీ ఇష్టం అంటూ వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న.