అది జగన్ స్క్ట్రిప్టే, రాజకీయ ఓనమాలు తెలుసా?: రోజాపై బుద్ధా ఫైర్, మాగంటి జోస్యం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
అమరావతి/విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ను రోజా చదువుతోందని విమర్శించారు.
రోజాకు రాజకీయ ఓనమాలు తెలుసా?
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అసెంబ్లీకి వస్తామని రోజా అనడం విడ్డూరంగా ఉందని, అసలు, రోజాకు రాజకీయ ఓనమాలు తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించింది.. ఫిరాయింపులకు బ్రాండ్ అంబాసిడర్ వైయస్ రాజశేఖరరెడ్డేనని అన్నారు.
జగన్కు సవాల్..
పార్టీ ఫిరాయింపులపై జగన్ చర్చకు రావాలని సవాల్ విసిరిన బుద్ధా.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఒక్క ఎంపీతో అయినా రాజీనామా చేయించావా? అని ఆమెను ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాల్సిన జగన్, పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.
జగన్ పునరాలోచించుకోవాలి..
పాదయాత్ర కంటే అసెంబ్లీ ప్రవిత్రమైనదని, అసెంబ్లీలోనే సమస్యలు పరిష్కారమవుతాయన్న విషయం ప్రతిపక్ష నేత జగన్ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ప్రజల మనోభావాలను నీరు కార్చడం వైసీపీకి మంచిది కాదని అన్నారు. అసెంబ్లీ బహిష్కరణపై వైసీపీ పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలచే ఎన్నకోబడిన ప్రజా ప్రతినిధి సభకు హాజరవడం ప్రాథమిక బాధ్యతని ఆయన గుర్తు చేశారు. కాబట్టి వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావడం మంచిదని ఆయన సూచించారు. ప్రజల మనోభావాలను నీరుగార్చడం వైసీపీకి మంచిది కాదని డొక్కా హితవు పలికారు.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. టీడీపీదే గెలుపు
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా 175 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని ఆ పార్టీ ఎంపీ మాగంటి బాబు జోష్యం చెప్పారు. శుక్రవారం ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారని తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీకి రాకుండా ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు వ్యతిరేకిస్తారని ఎంపీ విమర్శించారు. రాష్ట్రాన్ని దోచేస్తే.. అమరావతి నిర్మాణం జరుగుతుందా? పోలవరం వస్తుందా? ఈ పనులు ఒక్క చంద్రబాబు వల్లే జరుగుతాయని, ఆ విషయం ప్రజలకు తెలుసునని మాగంటి బాబు అన్నారు.