దేశమంతా గ్రీన్ ఛాలెంజ్: ఏపీలో మాత్రం మస్క్యుటో ఛాలెంజ్ అంటున్న బుద్దా వెంకన్న
ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయంగా వేడి పుట్టిస్తున్నారు. ఏపీలో ఇప్పుడు సవాళ్ల పర్వం కొనసాగుతోంది. దేశమంతా ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఛాలెంజ్ చేస్తుంటే ఏపీలో మాత్రం ఇప్పుడు మస్క్యుటో ఛాలెంజ్ చేస్తున్నారు టిడిపి నేతలు. రాష్ట్రంలో విపరీతంగా జ్వరాలు పెరిగిపోయాయని, డెంగ్యూ మలేరియా జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని పేర్కొంటున్న టిడిపి నేతలు అధికారంలో ఉన్నా ప్రజలు రోగాల నుండి కాపాడడానికి ఏం చేయలేక పోతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై మండిపడుతున్నారు .
వైసీపీ నేతలు కోరితే బాబు అపాయింట్మెంట్.. చంద్రబాబు కడప పర్యటన తో పొలిటికల్ హీట్
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన ట్విటర్ ఖాతా ద్వారా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మస్క్యుటో ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో గ్రీన్ ఛాలెంజ్ కంటే మస్క్యుటో ఛాలెంజ్ చాలా అవసరమని పేర్కొన్న బుద్దా వెంకన్న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాస ప్రాంతంలో దోమలు అరికట్టడానికి నానా తంటాలు పడుతున్నారని, రాష్ట్రంలో అత్యధికంగా డెంగ్యూ, మలేరియా జ్వరాలు తాడేపల్లిలోనే నమోదు అయ్యాయని తెలిపారు. గతంలో టిడిపి హయాంలో దోమలపై దండయాత్ర కార్యక్రమం చేస్తే, ఆ కార్యక్రమాన్ని ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డికి మస్కిటో ఛాలెంజ్ విసురుతున్నానని బుద్దా పేర్కొన్నారు.
తక్కువ ఖర్చుతో అయ్యే దోమల బ్యాట్తో అయినా సరే దోమలను నివారించినా ఛాలెంజ్లో గెలిచినట్టేనని ఆయన చెప్పారు. విజయసాయిరెడ్డి గెలిచాకా ఆర్థిక నిపుణులు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి మస్క్యుటో చాలెంజ్ విసరాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు బుద్ధా వెంకన్న. అంతేకాదు ఇక ఈ చాలెంజ్ ని రాష్ట్రమంతా ఉన్న వైసీపీ నేతలు తీసుకొని దోమల బారి నుండి రాష్ట్రాన్ని కాపాడాలని, ప్రజలను రోగాల బారినుండి కాపాడాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.