శవాలపై పేలాలు ఏరే బ్రాండ్ అంబాసిడర్ జగన్ .. డప్పు కొట్టేది మీరే : బుద్దా రివర్స్ పంచ్
ఏపీలో కరోనా వైరస్ కారణంగా ప్రజలు భయాందోళనలో చస్తున్నా రాజకీయ నాయకుల మాటల దాడి మాత్రం ఆగటం లేదు. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న రివర్స్ అటాక్ చేశారు . విజయసాయి రెడ్డి చిల్లర రాజకీయం మొదలు పెట్టారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ గురించి విజయసాయిరెడ్డికి బుద్దా వెంకన్న పలు ప్రశ్నలను సంధించారు.
జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న
కరోనా వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చిల్లర రాజకీయం మొదలుపెట్టిన విజయసాయి రెడ్డికి చిన్న నిజరోనా టెస్ట్ పెడుతున్నా అంటూ పేర్కొన్న బుద్దా వెంకన్న తండ్రి శవం దొరక్కముందే ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసి సంతకాలు సేకరించి శవాలపై పేలాలు ఏరుకున్నది ఎవరు ? అంటూ ప్రశ్నించారు . ఇక అంతేకాదు పెద్ద జబ్బుతో పోయిన వాడిని మా నాన్న కోసం పోయాడు అంటూ ఓదార్పు పేరుతో బుగ్గలు నిమిరి సగం మందికి మాత్రమే సహాయం అందించి మిగిలిన వాళ్ళకి ఎగ్గొట్టి శవాలపై పేలాలు ఏరిన నాయకుడు ఎవరు? ఆఖరికి బాబాయ్ హత్యని కూడా రాజకీయం కోసం వాడుకొని శవాలపై పేలాలు ఏరుకున్న వారు ఎవరు? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు బుద్దా వెంకన్న.
జగన్ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కి చేరిందన్న బుద్దా
సాయి రెడ్డి గారు ఈ ప్రశ్నలకు సమాధానం మీ ట్విట్టర్ లో పెడతారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేసిన బుద్దా వెంకన్న శవాలపై పేలాలు ఏరే బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు అయితే.. వెనుక డప్పు కొట్టేది మీరు అని మర్చిపోతే ఎలా సాయి రెడ్డి అని రివర్స్ పంచ్ ఇచ్చారు . ఇక మరో ట్వీట్ లో వై ఎస్ జగన్ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కి చేరింది.దానికి విజయసాయిరెడ్డి సైకో తెలివితేటలు తోడయ్యాయి వెరసి జగన్ బ్రిటన్ ప్రధాని అయ్యారు. వాలంటీర్ల పేరుతో వైకాపా కార్యకర్తలకు నెలకు 400 కోట్లు ప్రజా ధనం దోచిపెడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు .
Recommended Video
రేషన్ సరుకులు ఇంటికి ఇవ్వలేని వాలంటీర్ వ్యవస్థ ఎందుకు
ఇక అంతే కాదు ప్రజలు కష్టాల్లో ఉంటే రేషన్ సరుకులు ఇంటికి ఇవ్వలేని వాలంటీర్ వ్యవస్థ ఎందుకు దండగ అని పేర్కొన్న బుద్దా వెంకన్న రేషన్ కోసం జనాల్ని గుంపులు గా నిలబెట్టి కరోనా బారిన పడేలా చేస్తారా? అంటూ ప్రశ్నించారు . ఇంత అస్తవ్యస్తంగా ఉన్న జగన్ చెత్త పాలనని బ్రిటన్ లాంటి దేశాలు ఆదర్శంగా తీసుకున్నాయి అని బ్లాక్ పేపర్ లో వార్తలు రాయించుకోవడానికి సిగ్గుగా లేదు సాయి రెడ్డి ? అని మండిపడ్డారు. అంతేకాదు ఒక్క అవకాశం ఇచ్చారు..ఏం మార్పు తెచ్చారు? అని ప్రశ్నించారు .