గుడిలో కొబ్బరి చిప్పల దొంగ...బుద్దా వెంకన్న:వైసిపి నేతలు
విజయవాడ:ఎపిలో అధికార పార్టీ టిడిపి, ప్రతిపక్షం వైసిపి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. వైసిపి ఎమ్మెల్యే రోజా తాగా మాట్లాడుతోందని ఎద్దేవా చేసిన టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు.
కనీసం మహిళా ఎమ్మెల్యే అన్న కనీస గౌరవం లేకుండా రోజాపై అనుచిత వాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న సంస్కార హీనుడని వైసిపి నేతలు మండిపడ్డారు. గన్నవరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు జోగి రమేశ్, సామినేని ఉదయభాను, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావు, పేర్ని నాని మాట్లాడుతూ తదిదరులు పాల్గొన్నారు.
గుడిలో కొబ్బరి చిప్పలు దొంగిలించే చరిత్ర బుద్దా వెంకన్నది అని ఈ సందర్భంగా వైసిపి నేతలు ఎద్దేవా చేశారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగే వ్యక్తి బుద్దా వెంకన్న అని విమర్శించారు.
బజారులో ఛీకొట్టిన వారిని చంద్రబాబు తమ పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్సీలు, విప్ పదవులు ఇస్తున్నారని వైసిపి నేతలు విమర్శించారు. మహిళలను గౌరవించాలంటూ చంద్రబాబు ఒకవైపు ర్యాలీలు నిర్వహిస్తూనే మరోవైపు తన ఎమ్మెల్సీల చేత ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయిన్నారని వైసిపి నేతలు ఆరోపించారు.
చంద్రబాబు ఒక్క రోజు దీక్ష కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, కానీ తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు తెలిపారు.