నోరు అదుపులో పెట్టుకోండి.. వైసీపీ వస్తే అల్లోకల్లోలమే: చెవిరెడ్డికి బుద్దా వెంకన్న వార్నింగ్
అధికారంలోకి రాగానే అధికారుల అంతు చూస్తామంటూ వైసీపీ నేతలు బెదిరించడాన్ని వెంకన్న తీవ్రంగా తప్పుపట్టారు. వైసీపీ హెచ్చరికలు చూస్తుంటే.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అల్లకల్లోలం జరగడం ఖాయమన్నారు.
విజయవాడ: చంద్రబాబు హయాంలో వైసీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన అధికారులను వదిలిపెట్టేది లేదని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు భగ్గమంటున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసేవాళ్లు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
ఉద్యోగులపై మరోసారి రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఏడాదిన్నరలో అధికారంలోకి వస్తామన్న చెవిరెడ్డి వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ.. అవన్ని పగటి కలలే అన్నారు బుద్దా వెంకన్న.ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా వైసీపీ పగటి కలలు కంటోందని మండిపడ్డారు. అధికారులపై ఆ పార్టీ నేతలు దుర్భాషాలడడం సిగ్గుచేటు విషయమన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని, వైసీపీ అధికారంలోకి రావడమన్నది కలగానే మిగిలిపోతుందని అన్నారు.విజయవాడ ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకన్న ఈ వ్యాఖ్యలు చేశారు.
అధికారంలోకి రాగానే అధికారుల అంతు చూస్తామంటూ వైసీపీ నేతలు బెదిరించడాన్ని వెంకన్న తీవ్రంగా తప్పుపట్టారు. వైసీపీ హెచ్చరికలు చూస్తుంటే.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అల్లకల్లోలం జరగడం ఖాయమన్నారు. చెవిరెడ్డి రౌడీ చరిత్ర అందరికీ తెలిసిందేనని మండిపడ్డారు.
ఇక విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావిస్తూ.. విశాఖ ఇమేజ్ ను దెబ్బతీసేందుకే భూకబ్జాల పేరుతో ఆయన రాద్దాంతం చేస్తున్నాడని వెంకన్న ఆరోపించారు. భూకబ్జాలను బయటపెట్టిందే టీడీపీ ప్రభుత్వమని గుర్తుచేశారు.సీఎం దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారని, కలెక్టర్తోపాటు ఉప ముఖ్య మంత్రి కూడా దర్యాప్తు చేయిస్తున్నారని తెలిపారు.
విశాఖలో లక్ష ఎకరాలు కబ్జాకు గురైందన్న విజయసాయిరెడ్డి ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. విజయసాయిరెడ్డి ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవమున్నా.. వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకోసం ఆయనకు 24గం. సమయం ఇస్తున్నామని, ఆలోగా నిరూపించాలని డిమాండ్ చేశారు.