బుద్దా వెంకన్న లేఖాస్త్రం: చంద్రబాబు, లోకేశ్ భద్రత తగ్గించడంపై అమిత్ షాకు లేఖ..
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ఆరోపించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి లోకేశ్, ఇతర టీడీపీ నేతలకు కావాలనే భద్రతా తగ్గిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపు చర్యలను రెండు పేజీల లేఖ ద్వారా వివరించారు.
భద్రత తగ్గించడమే గాక..
చంద్రబాబు, లోకేశ్ భద్రతా తగ్గించడమే గాక.. వారి పర్యటనలకు వెళ్లిన సమయంలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని లేఖలో బుద్దా వెంకన్న గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత పర్యటనకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు.. వైసీపీ నేతలను మాత్రం అడ్డుకోవడం లేదన్నారు. దీనికి ఇటీవల ఉత్తరాంధ్రలో జరిగిన పర్యటన సాక్ష్యం అని తెలిపారు. విశాఖపట్టణం విమానాశ్రయంలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 5 గంటలపాటు కారులో కూర్చొన్నారని గుర్తుచేశారు. కాన్వాయ్పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేయడం హేయనీయమని అభివర్ణించారు.
పల్నాడులో కూడా..
ఇదివరకు పల్నాడులో కూడా ఇలాగే ప్రవర్తించారని బుద్దా వెంకన్న గుర్తుచేశారు. పర్యటనకు వెళ్లకుండా ఉండేందుకు ఇంటిగేటుకు తాళ్లతో కట్టి.. పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా నేతల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలకు అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. విశాఖ వెస్ట్ జోన్ ఏసీపీ సెక్షన్ 151 కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం సరికాదని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
జెడ్ క్యాటగిరీ నుంచి..
గత 9 నెలల్లో లోకేశ్ భద్రతను రెండుసార్లు తగ్గించారని బుద్దావెంకన్న పేర్కొన్నారు. జెడ్ క్యాటగిరీ భద్రత నుంచి ఎక్స్ క్యాటగిరీకి వచ్చారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలిలో లోకేశ్.. చేపట్టిన ప్రజాచైతన్య యాత్రను.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. టీడీపీ నేతల భద్రతను కూడా జగన్ సర్కార్ కుదించుకుంటూ వస్తోందని.. మాజీ ఎమ్మెల్యేలు.. ఎంపీలకు పూర్తిగా భద్రతను తొలగించారని చెప్పారు. వైసీపీలో వైసీపీ అరాచకాలపై చర్యలు తీసుకోవాలని అమిత్ షాను బుద్దా వెంకన్న కోరారు.