వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
Recommended Video
అమరావతి: ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం శాసన సభలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని ఆయన చెప్పారు. రూ.19,070తో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
వ్యవసాయ రంగంలో 25 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పారు. వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. వంద శాతం రాయితీతో సూక్ష్మ పోషకాలు అందిస్తున్నామని, విత్తణ పంపిణీలో జాతీయస్థాయి అవార్డు సాధించామన్నారు.
ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.19,070 కాగా, రెవెన్యూ వ్యయం రూ.18,602 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.468 కోట్లు.
రెండో అర్థ సంవత్సరంలో 24.5 శాతం వృద్ధి సాధించామని, జాతీయ స్థాయి వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్ర వృద్ధిరేటు 14 శాతం అధికంగా నమోదయిందని చెప్పారు. రబీలో 42 శాతం వర్షపాతం తక్కువగా నమోదయిందని, వరి దిగుబడి స్వల్పంగా తగ్గినా హెక్టారుకు 5,176 కిలోల ఉత్పత్తి నమోదయిందన్నారు.
ఏపీ మొక్కజొన్న ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానం, వరి ఉత్పాదనలో మూడో స్థానంలో ఉందన్నారు. పట్టిసీమ ద్వారా ముందస్తు నీటి విడుదల వల్ల అధికోత్పత్తి సాధ్యమైందని, రబీ పంట చివరి దశ సాగునీటికి మార్గం సుగమమైందన్నారు.
విభజన తర్వాత నాగార్జున సాగర్ నుంచి రాష్ట్ర నీటి వాటా 132 టీఎంసీలు మాత్రమే వచ్చాయని, రైతులకు వందశాతం రాయితీతో సూక్ష్మ పోషకాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన విత్తనాల సరఫరాల కోసం ఆధార్ అనుసంధానం అమలు చేస్తున్నామన్నారు.
విత్తన సరఫరాలో పారదర్శకతకు రాష్ట్రానికి జాతీయస్థాయిలో అవార్డు లభించిందన్నారు. వేరు శనగ విత్తనాలను 90 శాతం రాయితీతో సరఫరా చేశామన్నారు. రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అగ్రిటెక్ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. కాగా, ఏపీ రూ.1.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టింది.