దెబ్బకు దెబ్బ: అమరావతి ఖాళీ: హైకోర్టు షిఫ్ట్: కేంద్రంపై ఒత్తిడి: పార్లమెంట్లో వ్యూహం
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ నెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కాబోతోన్న నేపథ్యంలో ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్లమెంట్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులు, తీర్మానాలు.. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటేనే మద్దతు ఇవ్వాలని సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలను రాబట్టుకోవడంపై గళమెత్తాలని చెప్పారు.
జగన్ సర్కార్కు మళ్లీ ఎదురుదెబ్బ: విచారణ చేపట్టిన నిమిషాల్లోనే: ఉద్యోగులపై ఘాటు వ్యాఖ్యలు
నదుల జాతీయం.. అనుసంధానం..
ఈ భేటీ ముగిసిన అనంతరం.. దీనికి సంబంధించిన వివరాలను రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విలేకరులకు వెల్లడించారు. జల వివాదాలను పరిష్కరించుకోవడానికి దేశవ్యాప్తంగా నదులను అనుసంధానించాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలిపారు. నదులన్నింటినీ జాతీయం చేయడం వల్ల జల వివాదాలకు పుల్స్టాప్ పడుతుందని పేర్కొన్నారు. నదులను అనుసంధానించడం ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి నదీ జలాలలను రాష్ట్రాల భూ విస్తీర్ణం, దామాషా ప్రకారం పంపిణీ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అభిప్రాయపడినట్లు చెప్పారు.
దిశ బిల్లు కేంద్రానికి
దిశ బిల్లులో కొన్ని లోపాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, దాన్ని సవరించాలని సూచిస్తూ దాన్ని వెనక్కి పంపించిందని సాయిరెడ్డి అన్నారు. కేంద్రం సూచనలకు అనుగుణంగా దిశ బిల్లులో సవరణలను చేసి, దాన్ని మళ్లీ ఆమోదానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. ఈ బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సభ ముందుకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. హైకోర్టును కర్నూలుకు తరలించే విషయం కొత్తగా నోటిఫికేషన్ను జారీ చేయాలని ముఖ్యమంత్రి ఇదివరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని, దాన్ని తాము పార్లమెంట్లో లేవనెత్తుతామని అన్నారు. అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖపైనా ఒత్తిళ్లను తీసుకొస్తామని అన్నారు.
Recommended Video
ఉపాధి హామీ బకాయిలు..
ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 3,707 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. దేవాలయాలపై చోటు చేసుకున్న దాడులు, విగ్రహాల విధ్వంసాలకు సంబంధించిన కేసుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారని, ఈ విషయాన్ని తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని విజయసాయి రెడ్డి అన్నారు.
విగ్రహాల విధ్వంసం కేసులు టీడీపీ ప్రమేయం..
టీడీపీ నేతలకు నేరుగా ప్రమేయం ఉందనే విషయానికి సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ప్రమేయం ఉందని, దానికి సంబంధించిన విజువల్స్ తమ వద్ద ఉన్నాయని అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వ ధోరణిని కనపరుస్తోందని సాయిరెడ్డి అన్నారు. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తామని, రైల్వే మంత్రితో చర్చించి, దాన్ని పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.