బాబు చక్రం తిప్పేది అందుకేనా: విష్ణు, పది రోజుల్లో తెగదెంపులు: బుచ్చయ్య
అమరావతి: కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయంపై బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య చిచ్చు మరింత రాజుకుంటోంది. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన టిడిపి ఎంపీలపై బిజెపి ఎమ్మెల్సీ విష్ణు కుమార్ రాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
బిజెపిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన అన్నారు. బిజెపి, టిడిపికి మధ్య పొత్తుపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు.
పోలవరంపై విష్ణుకుమార్ రాజు ఇలా...
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులెన్ని, జరిగిన పని ఎంత అని విష్ణుకుమార్ రాజు అడిగారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తామని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మరో కంపెనీని ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు బడ్జెట్పై అసహనం ఉంటే అడగాలి గానీ వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆయన అన్నారు.
లోకేష్కు అవార్డులు ఎలా వచ్చాయి...
మంత్రి నారా లోకేష్కు 19 అవార్డులు రావడానికి కేంద్రం ఇచ్చిన నిధులు కారణం కాదా అని విష్ణుకుమార్ రాజు అడిగాు. పోలవరం ముంపు మండలాలను ఎపిలో కలిపిన ఘనత తమ బిజెపిదేనని, మిత్రపక్షంగా ఉంటూ తపై విమర్శలు చేస్తున్న నేతల ఒక్కసారి ఆలోచించుకోవాలని ఆయన అన్నారు.
చంద్రబాబు చక్రం ఎందుకు తిప్పుతారు..
చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నాయకులే సరిగా అర్థం చేసుకోవడం లేదని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పి బిజెపికి వ్యతిరేకంగా చంద్రబాబు పనిచేస్తారనే టిడిపి ఎంపీల మాటలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గతంలో చంద్రబాబు చక్రం తిప్పి కాంగ్రెసు ప్రభుత్వాన్ని నిలబెట్టారని, ఇప్పుడు కూడా కాంగ్రెసు కోసం చంద్రబాబు చక్రం తిప్పుతారా అని అన్నారు.
వ్యాపారులే అలా మాట్లాడుతున్నారు...
చంద్రబాబు ఢిల్లీలోకాంగ్రెసుతో చక్రం తిప్పి గతంలో దేవెగౌడ ప్రభుత్వాన్ని నెలకొల్పారని, ఇప్పుడు చక్రం తిప్పి తమ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెసు ప్రభుత్వాన్ని నెలకొల్పుతారా అని విష్ణు కుమార్ రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా మాట్లాడిన ఇద్దరు కూడా వ్యాపారులేనని ఆయన అన్నారు. వ్యాపారుల కోసం తమ ప్రభుత్వం పనిచేయడం లేదని అన్నారు. కోట్ల వ్యాపారాలు చేస్తూ రాజకీయాలు చేసే వారికి కేంద్ర బడ్జెట్ మింగుడు పడడం లేదని ఆయన అన్నారు.
కేంద్రంపై బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తమ భ్రమలు తొలగిపోయాయని ఆయన శనివారం మీడియాతో అన్నారు. కేంద్ర బడ్జెట్పై ప్రతి సీమాంధ్రుడి గుండె రగిలిపోతోందని ఆయన అన్నారు.
పది రోజుల్లో తెగదెంపులపై తేలిపోతుంది...
ఫెడరల్ స్ఫూర్తికి కేంద్రం తూట్లు పొడుస్తోందని బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇంకా బిజెపిని పట్టుకుని వేలాడడం సరి కాదని ఆయన అన్నారు. తెగదెంపులపై పది రోజుల్లో ఏదో ఒకటి తేలిపోతుందని అన్నారు. సహనం నశిస్తే తెలుగువారు తిరగబడుతారని ఆయన హెచ్చరించారు.
సీమాంద్రను బిచ్చగాళ్లను చేశారు..
సీమాంధ్రులను కేంద్రం బిచ్చగాళ్లను చేసిందని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దగా చేసిందని అన్నారు. రాష్ట్ర విభజన తాము కోరుకుంది కాదని, కాంగ్రెసు చేసింది, బిజెపి నాయత్వం చేయాలని చెప్పిందని ఆయన అన్నారు. అటువంటి స్థితిలో విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిన బాధ్యత బిజెపికి లేదా అని ఆయన అడిగారు.
ప్యాకేజీ అన్నారు, సరేనన్నాం..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు, ప్యాకేజీ ఇస్తామంటే తాము సరేనని అన్నామని బుచ్చయ్య చౌరి చెబుతూ ఏమిచ్చారని అడిగారు. రైల్వే జోన్ విషయంలో మోసం చేశారని దుయ్యబట్టారు. న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా అని ఆయన ప్రశ్నించారు.
అపోహలు వద్దని మంత్రి..
బిజెపి టిడిపి కలిసి పనిచేస్తున్నాయని, ఈ విషయంలో ఏ విధమైన అపోహలు కూడా వద్దని మంత్రి మాణిక్యాల రావు అన్నారు. హామీల అమలుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన శనివారం మీడియాతో అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ. 100 కోట్లే కేటాయించినా అంతకన్నా ఎక్కువ ఇచ్చిందని ఆయన చెప్పారు.
టెక్నికల్ అంశాల వల్లే అలా...
కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు తక్కువ కనిపిస్తున్నాయన, కానీ పూర్తి స్థాయి బడ్జెట్ ఇంకా రాలేదని మాణిక్యాల రావు అన్నారు. టెక్కికల్ అంశాల వల్లనే రైల్వే జోన్ ఆలస్యం అవుతోందని ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయం అయినా సాధిస్తామని ఆయన చెప్పారు.