ఫలించిన మంత్రాంగం: మున్సిపాలిటీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు: రూ.431 కోట్లు విడుదల
అమరావతి: రాష్ట్రంలో ఎట్లకేలకు మున్సిపాలిటీలకు 14వ ఆర్థిక కమిషన్ నుంచి 431 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈ మొత్తాన్ని మున్సిపల్ శాఖకు బదలాయించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం ఈ మొత్తాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో కరోనా వైరస్ అడ్డూ, అదుపు లేకుండా విజృంభిస్తోన్న ప్రస్తుత సమయంలో పట్టణాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కష్టతరంగా మారిందంటూ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే కేంద్రానికి ప్రతిపాదనలను పంపించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రస్తుతం లేనప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం నెలకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని 14వ ఆర్థిక కమిషన్ ఈ నిధులను మంజూరు చేసినట్లుగా భావిస్తున్నారు.
కేంద్రానికి ప్రతిపాదనలను పంపించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే పలుమార్లు 14వ ఆర్థిక సంఘానికి లేఖలు రాశారని, ఫోన్ ద్వారా కూడా వారిని సంప్రదించారని చెబుతున్నారు. ఆయన మంత్రాంగం ఫలించడంతో నిధులను విడుదల చేసినట్లు తెలుస్తోంది. 14వ ఆర్థిక కమిషన్ సిఫారసుల మేరకు 430,98,89,000 రూపాయలను విడుదల చేసినట్లు మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి జే శ్యామల రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు.
కరోనా వైరస్ను నియంత్రించే చర్యల్లో పారశుద్ధ్య పనులు అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి. రోడ్లను శానిటైజ్ చేస్తున్నారు. డిసెన్ఫెక్టెంట్గా మార్చుతున్నారు. దీనికోసం పెద్ద ఎత్తున అదనపు పరికరాలు, మందులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితులన్నింటినీ వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలను పంపించింది.
తాజాగా- దీనికి కేంద్రం ఆమోదముద్ర తెలిపింది. నిధులు అందిన వెంటనే.. ఈ మొత్తాన్ని మున్సిపల్ శాఖకు బదలాయిస్తూ జే శ్యామలరావు ఉత్తర్వులను జారీ చేశారు. ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులను విడుదల చేస్తామంటూ ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనితో ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న 212,77,50,000, 183,06,68,000, 35,14,71,000 కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేసింది.