మార్చి 5 నుంచి అసెంబ్లీ?...9వ తేదీన బడ్జెట్ ప్రతిపాదన!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ సమావేశాల్ని సుమారుగా మార్చి 5 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మార్చి 9న బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దాదాపుగా ఈ తేదీలు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తొలుత మార్చి12 నుంచి సమావేశాలు పెట్టాలని భావించినప్పటికీ, తెలంగాణలో కూడా అదే రోజున అసెంబ్లీ ప్రారంభమయ్యేటట్లు కనిపిస్తుండటంతో, ఎపి బడ్జెట్ సమావేశాలు అంతకంటే ముందు నుంచే ప్రారంభించాలని, అందుకే మార్చి 5 నుంచి సభ ఆరంభించాలని ప్రభుత్వ ముఖ్యులు యోచిస్తున్నట్లు సమాచారం. కారణం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉన్నందున రెండు రాష్ట్రాల మధ్య ఈ విషయమై సమస్యలు తలెత్తకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన సూత్రప్రాయ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, దీనిపై నిశితంగా చర్చించి ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇదే సమయంలో సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంపైనా ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి నిలిపింది. సాంప్రదాయ పద్దతిలో కాకుండా మారిన కాలానికి అనుగుణంగా అందరికీ అర్థమయ్యే తీరులో ప్రసంగం ఉండాలని అన్ని శాఖలకు ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలిసింది. అలాగే ఈసారి ప్రసంగపాఠం గతంలో లాగా అసమగ్రంగా కాకుండా ముందు బడ్జెట్ ద్వారా జరిగిన అభివృద్ధి, సాధించిన ప్రగతిని వివరిస్తూ సాగాలని, అంతేతప్ప కేవలం పట్టికలు, గ్రాఫ్లతో నింపినట్లు ఉండకూడదని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం విధానాల వల్ల ప్రజలపై ప్రభావం, 2017-18లో చేపట్టిన సంస్కరణలు, ప్రగతిని వివరిస్తూనే, కొత్త బడ్జెట్లో తీసుకోనున్న విధానాల్ని కూడా క్లుప్తంగా ప్రస్తావించాలని ఆర్థిక శాఖ సూచించినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళ, మైనారిటీ సంక్షేమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందుకే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి, సాధించిన ప్రగతిని వివరించేలా ప్రతులు ఉండాలని స్పష్టం చేసింది. ఈ వివరాల్ని ఫిబ్రవరి 8లోగా సమర్పించాలని స్పష్టం చేసిందని సమాచారం.