ఏదో జరుగుతుందని బాబు చూస్తున్నారు కానీ: జేసీ దివాకర్ రెడ్డి, అందుకే ఇలా: మురళీ మోహన్
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉన్నందుకైనా కేంద్రం ఏపీకి ఏదో ఒకటి చేయాల్సి ఉండెనని, ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ.. పాకేజీ అన్నారని, కానీ ప్యాకేజీ లేదు.. పాకేజీ లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు.
Recommended Video
బీజేపీ తమకు మిత్రపక్షం అని చెప్పేందుకు చేసింది ఏదీ లేదన్నారు. తాము పునరాలోచన చేసే సమయం ఆసన్నమైందని చెప్పారు. తీవ్ర నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. యమధర్మరాజులాంటి వాడే యుద్ధానికి సై అన్నాడని, చంద్రబాబు ఏమంటారో చూడాలన్నారు.
గంటకుపైగా వేచిచూసి 15ని.ల్లోనే: రాజ్నాథ్తో భేటీపై సుజనా షాకింగ్, అందుకే బాబు నిరసన
చంద్రబాబుకు సహనం ఎక్కువ
తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సహనం ఎక్కువ అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. బీజేపీతో పొత్తు వల్ల ఏదో జరుగుతుందనే ఆశతో చంద్రబాబు ఉన్నారని చెప్పారు. కానీ ఆ ఆశలు వమ్ము అవుతాయన్నారు. ఆయన నిరాశవాది కాదన్నారు.
మహానుభావుడు ధర్మరాజు కంటే సహనం
కానీ ఆ మహానుభావుడు (చంద్రబాబు) ఎంతకాలం ఎదురు చూస్తాడో చూడాలని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సహనానికి కూడా హద్దు ఉంటుందని చెప్పారు. చంద్రబాబు.. ధర్మరాజు కంటే సహనపరుడు అన్నారు. ఆయన చెప్పిన విధంగా తాము ముందుకు పోతామన్నారు.
ఎవరు కోరుకోకున్నా విభజన
ఏపీలో ఎవరు కోరుకోకున్నా విభజన జరిగిందని ఎంపీ మురలీ మోహన్ అన్నారు. విభజన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన మోడీ ఎందుకు న్యాయం చేయలేదన్నారు. నాలుగో ఏడాది కూడా అయిపోతుందని, అయినా న్యాయం జరగలేదన్నారు. అందుకే తమ అసంతృప్తిని తెలియజేస్తున్నామని చెప్పారు. ఎవరినీ నొప్పించకుండా సాధించుకోవాలనుకుంటున్నామని, సాధించే వరకు విశ్రమించమన్నారు. బడ్జెట్ బాగుందని చెప్పిన వైసీపీ ఎంపీలు ఇప్పుడు నిరసన వ్యక్తం చేయడం విడ్డూరమని టీడీపీ ఎంపీలు అన్నారు.
పార్లమెంటు ఎదుట వైసీపీ నిరసన
పార్లమెంటు ఎదుట వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉండి టీడీపీ ఏం సాధించిందని ప్రశ్నించారు. కేంద్రం న్యాయం చేసే వరకు పోరాటం ఆగదన్నారు. ఏపీని గట్టెక్కించేది హోదాయే అన్నారు. విభజన హామీల్లో కేంద్రం, రాష్ట్రం విఫలమయ్యాయని చెప్పారు. మరోవైపు, వాయిదా అనంతరం లోకసభ తిరిగి ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.