తలుపులేసి ఏపీని విభజించారు, మీ అవమానంవల్లే ఎన్టీఆర్ పార్టీ: లోకసభలో మోడీ సంచలనం, ఎంపీలపై అసహనం
Recommended Video
న్యూఢిల్లీ: ఏపీకి బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని, విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీలు లోకసభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ బుధవారం సభకు హాజరవ్వడానికి ముందు నుంచే వారు నిరసనలు తెలిపారు.
చదవండి: రాజ్యసభ నుంచి కేవీపీ సస్పెన్షన్, చిన్నపిల్లలా: ఎంపీలపై స్పీకర్ ఆగ్రహం, బాబుకు రాజ్ ఫోన్
ప్రధాని మోడీ సభలోకి వచ్చాక వారు తమ నిరసనలను తీవ్రతరం చేశారు. ఎంపీల నిరసనల మధ్యనే ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మోడీ మాట్లాడే సమయంలో నిరసన వద్దని ఎంపీలకు సూచించాలని కేంద్రమంత్రులు.. సీఎం చంద్రబాబుకు సూచించారు.
చదవండి: ఏం లెక్క ఇది, తప్పు చేసింది మీరు: జైట్లీపై తీవ్రస్థాయిలో ఊగిపోయిన బాబు
మూడు రాష్ట్రాల విభజన ప్రస్తావన
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించిందన్నారు. ఏపీ ఎంపీలు పదేపదే నినాదాలు చేస్తున్న సందర్భంలో ప్రధాని మోడీ.. వాజపేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజనను గుర్తు చేశారు. మోడీ మాట్లాడుతున్నా ఎంపీలు నిరసన తెలియజేస్తుండటంతో స్పీకర్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తలుపులేసి విభజన చేశారు
స్పీకర్ వారిస్తున్నప్పటికీ ఎంపీలు తమ నిరసన తెలియజేయడంపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాజపేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిందన్నారు. కానీ యూపీఏ హయాంలో మాత్రం సభకు తలుపులు వేసి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్ర విభజన చేసిందన్నారు.
ఏపీనే కాదు, దేశాన్ని మోసం చేసింది
ఎన్నికల ప్రయోజనాల కోసం నాడు యూపీఏ ప్రభుత్వం ఏపీని విభజించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఏపీ రాష్ట్రాన్నే కాదని, దేశాన్ని మోసం చేసిందని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. దేశ విభజన పాపం కూడా కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఆ పాపాన్ని ఇప్పటికీ 125 కోట్ల మంది ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు.
నిరసన ఆపన టీడీపీ ఎంపీలు
ప్రధాని మోడీ మాట్లాడే సమయంలో నిరసన చేపట్టవద్దంటూ చంద్రబాబుకు కేంద్రమంత్రులు ఫోన్ చేశారు. కానీ చంద్రబాబు సూచన మేరకు ఎంపీలు నిరసన ఆపలేదు. మోడీ మాట్లాడుతున్న సమయంలో వారు కూడా నిరసన తెలిపారు. మరోవైపు, విపక్షాలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. అవి తమ ఆందోళనను కొనసాగించాయి. ఇదిలా ఉండగా, కొద్ది సేపటి తర్వాత టీడీపీ ఎంపీలు తమ సీట్లో కూర్చున్నారు.
విభజన తీరు ఇబ్బందికరం
రాష్ట్ర విభజన ఇబ్బంది కాదని నరేంద్ర మోడీ అన్నారు. కానీ విభజన చేసిన తీరు ఇబ్బందికరమని చెప్పారు. ఇష్టారీతిగా రాష్ట్రాన్ని విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినకుండా విభజన చేయాలని తాము అప్పుడు, ఇప్పుడు కోరామన్నారు. తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేనని, కానీ తలుపులు మూసి విభజించడం సరికాదని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనకంటే తర్వాత స్వాతంత్రం వచ్చి న దేశాలు బాగుపడ్డాయన్నారు. కేవలం ఒక కుటుంబం బాగుండటం కోసం ఇన్నాళ్లు కాంగ్రెస్ పాలించిందని ఎద్దేవా చేశారు.
హైదరాబాదులో దళిత సీఎంకు రాజీవ్ గాంధీ అవమానం
కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంటే ఆశ్చర్యపోవాల్సిందేనని మోడీ అన్నారు. నాడు హైదరాబాదులో దళిత ముఖ్యమంత్రిని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అవమానించారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. అంజయ్యను, నీలం సంజీవరెడ్డి వంటి వారిని కాంగ్రెస్ అవమానించిందన్నారు.
మీరు చేసిన ద్రోహం వల్లే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు
కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాల వల్లే తెలుగుదేశం పార్టీ పుట్టిందని ప్రధాని మోడీ అన్నారు. తెలుగు జాతికి మీరు చేసిన ద్రోహం వల్లే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపానికి ఇప్పుడు దేశం మూల్యం చెల్లించుకుంటోందన్నారు. ఆ ఒక్క కుటుంబం నేతలను పొగడటమే కాంగ్రెస్ నేతల పని అని ఎద్దేవా చేశారు.
నీలం సంజీవరెడ్డికి వెన్నుపోటు, ఏపీ అనుభవిస్తోంది, రాహుల్ గాంధీ చించేశారు
నాటి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని మీ నాయకుడే మీడియాను పిలిచి మరీ ప్రతులను చించేసి నిరసన తెలిపారని రాహుల్ గాంధీని ఉద్దేశించి మోడీ అన్నారు. నీలం సంజీవ రెడ్డిని రాష్ట్రపతిగా ప్రకటించి వెన్నుపోటు పొడిచారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ను ప్రధానిని చేయాలని అన్ని కమిటీలు చెబితే నెహ్రూను తెచ్చి కూర్చోబెట్టారని, ఇదేనా మీ ప్రజాస్వామ్యం అని దుయ్యబట్టారు. తాము తెలంగాణను అప్పుడు, ఇప్పుడు కోరుకున్నామని, కానీ కాంగ్రెస్ చేసిన నష్టాన్ని ఏపీ ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు.
టీడీపీ ఎంపీలపై మోడీ అసహనం
అంతకుముందు, ప్రారంభంలో తాను ప్రసంగిస్తుండగా టీడీపీ ఎంపీలు పెద్దపెట్టున నినాదాలు చేయడంపై మోడీ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇరు రాష్ట్రాలను ముక్కలు చేయడంపై పాటించిన వైఖరే ఇంత దూరం తీసుకు వచ్చిందని, ఇప్పుడు సభ్యులు ఇలా చేయడం సరికాదన్నారు. విభజన జరిగి నాలుగేళ్లయినా సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి ఏపీ అనుభవిస్తోందన్నారు. టీడీపీ సభ్యుల నిరసన సరికాదన్నారు. దేనికైనా సమయం వస్తుందని మోడీ చెప్పారు. హామీల అమలు విషయంలో ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి నినాదాలు సరికాదన్నారు. అయితే ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
మోడీ కాంగ్రెస్ అరాచకాలకు ఏపీ సాక్ష్యం
పీవీ నర్సింహారావును కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని ప్రధాని మోడీ అన్నారు. ఏపీ గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ చేసిన అరాచక రాజకీయాలకు ఏపీ సాక్ష్యమని చెప్పారు. తాము రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కాకుండా రాష్ట్రాలు, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రాల విభజన చేశామన్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల పట్ల, తెలుగు నేతల పట్ల కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని మోడీ దుమ్ముదులిపారు.