జగన్ ఉన్నాడని రెచ్చిపోకు: భూమనకు బుద్ధా, అమరావతిలో వైసిపిXటిడిపి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి వెనుక ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆదివారం నాడు అన్నారు. హోంమంత్రి చినరాజప్పపై భూమన చేస్తున్న విమర్శల వెనక ఉన్న రాజకీయ శక్తి కచ్చితంగా జగనే అన్నారు.
జగన్ ప్రోద్బలంతోనే భూమన రెచ్చిపోతున్నారన్నారు. హోంమంత్రిని చులకన చేసి మాట్లాడటం సరికాదన్నారు. భూమన తన వైఖరిని మార్చుకోవాలని, లేదంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు.
తాను చేస్తున్న దీక్షను కాపుల సంక్షేమం కోసం కాకుండా తన రాజకీయ అవసరాల కోసం ముద్రగడ వాడుకుంటున్నారని మండిపడ్డారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నా కూడా, దీక్షలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. దీక్ష నాటకమేనని, దీని వెనుక సూత్రధారి జగన్ అన్నారు.
అమరావతిలో టీడీపీ, వైసీపీ ఆందోళన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అమరావతిలో చేపట్టిన పర్యటన ఉద్రిక్తంగా మారింది. సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో వాస్తవాల అధ్యయనం పేరిట చేపట్టిన పర్యటనను టిడిపి శ్రేణులు అడ్డుకున్నారు. తప్పుడు ఆరోపణలు చేసేందుకే వైసిపి నేతల పర్యటన అంటూ టిడిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఇరు పార్టీల కార్యకర్తలు రహదారిపై బైఠాయించి పోటాపోటీగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కాగా, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు నేతృత్వంలో వైసిపి వచ్చింది.