భజనలందు.. లోకేశ్ భజన వేరయా.. బాబు గర్భంలో ఉన్నప్పటి విషయాలు చెప్పిన టీడీపీ నేత !
విజయవాడ: ఎన్నికల ప్రచార సమయాల్లో రాజకీయ నాయకులు చెప్పే మాటలు, చేసే ప్రకటనలు కొన్ని సందర్భాల్లో భలే కామెడీగా అనిపిస్తుంటాయి. జనాన్ని నవ్వుల్లో ముంచెత్తిస్తాయి. లాజిక్ లేకుండా మాట్లాడేస్తుంటారు. పొంతన లేని పోలికలు తెస్తుంటారు. తాజాగా- కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు బుద్ధా వెంకన్న చేసిన కొన్ని కామెంట్స్ జనాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నవ్వు తెప్పిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. లోకేష్ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది టీడీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి విజయం కోసం వ్యూహాలు రూపొందించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ, ప్రముఖ నటుడు మోహన్ బాబు వంటి నాయకులు మంగళగిరిలో ప్రచారాన్ని నిర్వహించారు. దీన్ని అడ్డు పెట్టుుకుని బుద్ధా వెంకన్న వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేశారు. త్వరలో మరికొంతమంది ప్రముఖులు వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారానికి రానున్నారు.
కలియుగ అభిమన్యుడు.. లోకేష్
నారా లోకేష్ ను ఓడించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్లు, పార్టీతో సంబంధమే లేని పెయిడ్ వర్కర్లను మంగళగిరిలో దించారని బుద్ధా వెంకన్న విమర్శించారు. మంగళగిరి చుట్టూ తన మందీ మార్బలాన్ని మోహరింపజేశారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెయిడ్ వర్కర్లుగా మారిన మందకృష్ణ మాదిగ, బీసీ నేత ఆర్ కృష్ణయ్యతో పాటు జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి నటులను మంగళగిరికి పంపిస్తున్నారని బుద్ధా ఆరోపించారు. అయినప్పటికీ- లోకేష్ బాబును ఏమీ చేయలేరని చెప్పారు. నారా లోకేష్ కలియుగ అభిమన్యుడని అభివర్ణించారు.
తాత విద్యలు, తండ్రి గుణగణాలు..
లోకేష్ బాబు తన తల్లి నారా భువనేశ్వరి కడుపులో ఉన్నప్పుడే ప్రజాసేవ ఎలా చేయాలో నేర్చుకున్నారని చెప్పారు. కడుపులో ఉండగానే తాత ఎన్టీఆర్ వద్ద విద్యలను అభ్యసించారని, తండ్రి చంద్రబాబు నాయుడి గుణగణాలను పుణికి పుచ్చుకున్నారని అన్నారు. ఈ రాష్ట్రానికి మకుటం లేని యువరాజు తమ లోకేష్ బాబు అని వెంకన్న చెప్పారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రాజు చంద్రబాబు.. అతని కుమారుడు లోకేష్ యువరాజు.. అని వ్యాఖ్యానించారు. అయిదు కాదు, పది కాదు మరో 40సంవత్సరాల పాటు లోకేష్ మంగళగిరికి ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు. ఈ స్థానంపై గెలుపును వైఎస్ఆర్ సీపీ మరిచిపోవాల్సిందేనని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ఇక వైఎస్ఆర్ సీపీ గానీ, ఇంకో పార్టీ అభ్యర్థి గానీ జీవితంలో గెలవలేరని చెప్పారు. తామంతా దగ్గరుండి లోకేష్ ను గెలిపిస్తామని, మంగళగిరిని పార్టీకి కంచుకోటగా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు అంటే వైఎస్ కు భయం..లోకేష్ అంటే జగన్ వణుకు
గతంలో చంద్రబాబు నాయుడు పేరు వింటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భయ పడేవారని బుద్ధా వెంకన్న చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు కుమారుడు లోకేష్ అంటే జగన్ గజగజ వణికిపోతున్నారని, అందుకే పెయిడ్ వర్కర్లతో ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. అభిమన్యుడిని పద్మవ్యూహంలో బంధించినట్లుగా.. వందలాది మందిని జగన్మోహన్ రెడ్డి మంగళగిరి పైకి యుద్ధానికి పంపిస్తున్నట్లు ఉందని అన్నారు. జగన్ పన్నిన పద్మవ్యూహంలో లోకేష్ చిక్కుకోరని, కలియుగ అభిమన్యుడిలా ఛేదించుకుని వస్తారని బుద్ధా వెంకన్న చెప్పారు. బుద్ధా వెంకన్న చేసిన కామెంట్లపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.