యాజమాని ఇంట్లో చోరీ: దొంగను పట్టించిన గేదె
నెల్లూరు: ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగను తన కొమ్ములతో పొడిచి పట్టించింది ఓ గేదె. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా మన్నెంవారిపల్లెలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మన్నెంవారిపల్లె నివాసముంటున్న విజయమ్మ తన కుమారుడు, కుమార్తెలతో కలిసి తమ ఇంట్లో నిద్రిస్తోంది. అదే సమయంలో రాత్రి ఒంటిగంట తర్వాత నలుగురు దుండగులు వారింట్లో దొంగతనానికి వచ్చారు.
విజయమ్మ మెడలోని బంగారు గొలుసును, చెవి కమ్మలను లాక్కున్నారు. దీంతో బాధితురాలు పెద్దగా కేకలు వేసింది. కంగారుపడిన దొంగలు పరుగు లంఘించారు. కాగా, వీరిలో ఒకరిని ఇంటి ఆవరణలో ఉన్న గేదె తన కొమ్ములతో పొడిచేసింది.
దీంతో గాయపడిన ఆ దొంగ అక్కడే పడిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు అతడ్ని పట్టుకుని చితక్కొట్టారు. ఆ తర్వాత ఆ దొంగను పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మిగితా దొంగల కోసం గాలింపు చేపట్టారు.