ఘర్షణకు దారి తీసిన గేదె మూత్రం: ఒకరు మృతి, మరొకరు బ్రెయిన్ డెడ్
గుంటూరు: గేదె మూత్ర విసర్జన రెండు కుటుంబాలకు మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఒకరు మరణించగా, అతని సోదరుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఓ కుటుంబానికి చెందిన గేదె మరో కుటుంబానికి చెందిన ఇంటి ముందు మూత్ర విసర్జన చేసింది. దాంతో ఘర్షణ తలెత్తింది.
గుంటూరు జిల్లా గురజాల మండలంలోని జంగమేశ్వరపురం గ్రామంలో ఆ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలు చెన్నారెడ్డికి చెందిన గేదె పొరుగున ఉండే కొంగటి నాగిరెడ్డి ఇంటి ముందు మూత్ర విసర్జన చేసింది.
దాంతో ఆగ్రహించిన నాగిరెడ్డి గేదెపై కత్తితో దాడి చేశాడు. అది చూసిన చెన్నారెడ్డి భార్య సరోజినమ్మ ఆ విషయాన్ని వెంటనే తన సోదరులు యేసిరె్డి శ్రీనివాస రెడ్డి, పుల్లారెడ్డిలకు చెప్పింది.
వారితో పాటు సరోజినమ్మ నాగిరెడ్డి ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. మాట మాటా పెరిగి భౌతిక దాడులు దారి తీసింది. నాగిరెడ్డి,తో పాటు ఆయన కుమారులు వీరారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వారిపై దాడి చేశారు. విషయం తెలిసిన చెన్నారెడ్డి అక్కడికి వెళ్లాడు. అతనిపై కూడా దాడి జరిగింది
ఆ ఘటనలో యేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తలకు గాయాలై ఆక్కడికక్కడే కూలిపోయాడు. దాంతో గ్రామస్థులు పెద్ద యెత్తున తరలిరావడంతో నాగిరెడ్డి కుటుంబ సభ్యులు పారిపోయారు.
గుంటూరు ఆస్పత్రికి తరలిస్తుండగా యేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మార్గమధ్యంలో మరణించాడు. పుల్లారెడ్డి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. చెన్నారెడ్డి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.
నాగిరెడ్డి, ఆయన కుమారులు వీరారెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిపై హత్య కేసు నమోదు చేశారు. గాయపడిన గేదె మాత్రం ప్రాణాలతో ఉంది.