'అమరావతిలో భారీ స్కాం, బాబు రాజీనామా చేయాలి, దుర్గమ్మ భూమిపై కన్ను'
అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని పేరుతో ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తోందని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
విదేశీ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు ఎందుకు కట్టబెడుతున్నారో చెప్పాలని నిలదీశారు. సింగపూర్, న్యూయార్క్ వచ్చేస్తోందని పోస్టర్లు వేసి ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానం పైన హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిందన్నారు.
ఆ విధానం పైన జడ్జి అనేక అభ్యంతరాలు లేవనెత్తారని చెప్పారు. చంద్రబాబుకు నైతికత ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిలు హైకోర్టు తప్పుబట్టినప్పుడు రాజీనామాలు చేశారన్నారు.
అమరావతి నిర్మాణం పేరుతో వేలకోట్ల కుంభకోణం జరిగిందని బుగ్గన ఆరోపించారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ కేసులో జోక్యం చేసుకున్నట్లు జడ్జి వ్యాఖ్యానించారని, కోర్టు అన్ని అభ్యంతరాలు లేవనెత్తినా మంత్రి నారాయణ మాత్రం చట్టాన్ని సవరించి మరో నోటిఫికేషన్ ఇస్తామని చెబుతున్నారని, న్యాయవ్యవస్థ అంటే ప్రభుత్వానికి గౌరవం లేదా అని నిలదీశారు.
సింగపూర్ కంపెనీలకు రూ.12 నుంచి రూ.15వేల కోట్ల విలువైన భూములు ధారాదత్తం చేయడమే చంద్రబాబు ఉద్దేశ్యమన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఓటుకు డబ్బులు పెట్టి కొనడం తప్పుకాదని చంద్రబాబు తరఫు లాయర్ వాదిస్తున్నారని, అంటే ఓటుకు డబ్బులు ఇచ్చినట్లు ఆ లాయర్ హైకోర్టులో ఒప్పుకున్నారన్నారు. ఓ వైపు రైతుల భూములతో పాటు సదావర్తి భూములు తమ వారికి కట్టెట్టిన ప్రభుత్వం ఇప్పుడు బెజవాడ దురగ్మ్మ భూములను కూడా వదలడం లేదని ఆరోపించారు. దుర్గమ్మ భూములను ప్రయివేటు విద్యాసంస్థకు కట్టబెట్టేందుకు యత్నిస్తోందన్నారు.