అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు: మూడు రాజధానులపై మంత్రి బుగ్గన కీలక ప్రకటన
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ మూడు రాజధానులు, రాజధాని ప్రాంతంలో భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు చారిత్రాత్మకమైనదని స్పష్టం చేశారు.
మూడు రాజధానులు ఇలా..
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా లోకల్ జోన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 4 జిల్లాలను కలిపి ఒక జోనల్ డెవలప్మెంట్ బోర్టు ఉంటుందని చెప్పారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్. లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఏరియా ఉంటాయని వివరించారు. విశాఖలోనే రాజ్భవన్, సచివాలయం, హెచ్ఓడీ ఆఫీసులు ఉంటాయని బుగ్గన తెలిపారు.
సమాన అభివృద్ధి, అవకాశాలు
అభివృద్ధి, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు రావాలని ప్రజలు కోరుతున్నారని, ఇది వికేంద్రీకరణతోనే సాధ్యమవుతుందని అన్నారు. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడి ఉన్నట్లు చెప్పిందని తెలిపారు.
తెలంగాణా లాంటి సమస్య రావొద్దని..
రాజధానిపై నిపుణులతో వేసిన శివరామకృష్ణ కమిటీ సూచనలను చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు నారాయణ కమిటీ వేశారన్నారు.
వ్యవసాయ భూములను రాజధాని కోసం తీసుకోకూడదని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని తెలిపారు. తెలంగాణ లాంటి సమస్య రావొద్దంటే ఏపీలోని 13 జిల్లాలు సమాన అభివృద్ధి సాధించాలని శివరామకృష్ణ కమిటీ సూచించిందని తెలిపారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను, సూచనలను చంద్రబాబు సర్కారు అసెంబ్లీ దృష్టికి కూడా తీసుకురాలేదని మంత్రి బుగ్గన చెప్పారు.
కొత్త రాజధాని ఎలా?.. వరదలు వస్తే అమరావతి 70శాతం
ఏపీకి ఆదాయం తక్కువ.. అప్పు ఎక్కువగా ఉందని బీసీజీ చెప్పిందని.. ఇలాంటి పరిస్థితిలో అప్పులు చేసి రాజధానిని నిర్మించలేమని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తలసరి ఆదాయంలో ఏపీలో చివరన ఉందని తెలిపారు. గత ప్రభుత్వం చూపిన గ్రాఫిక్స్ తో రాజధాని కట్టాలంటే ప్రతి 10వేల మందికి 30 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. భారీ వర్షాలు, వరదలు వస్తే అమరావతి రాజధాని ప్రాంతం 70శాతం వరకు మునిగిపోతుందని చెప్పారు.