నిర్మలా సీతారామన్తో మంత్రి బుగ్గన భేటీ: రావాల్సిన నిధులు, కీలక అంశాలపై చర్చ
న్యూఢిల్లీ/అమరావతి: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, రాస్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలు, రాష్ట్ర పరిస్థితిపై చర్చించారు.
మనసున్న మారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కితాబు
కరోనాతో ఇబ్బందుల్లో రాష్ట్రం..
అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా రాష్ట్ర అంశాలపై కేంద్రంతో చర్చించే అవకాశం రాలేదని అన్నారు. కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. పన్ను వసూళ్లలో గత 3 నెలల్లో 40 శాతం లోటు ఏర్పడిందని తెలిపారు.
బకాయిలు ఇవ్వండి..
పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, విభజన చట్టంలోనిఅభివృద్ధి పథకాలకు నిధులు, పీడీఎస్, జీఎస్టీ బకాయిలు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. జీఎస్టీ బకాయిలు రూ. 3000 కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు అదనపు నిధులిచ్చి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని బుగ్గన తెలిపారు.
పోలవరం త్వరగా పూర్తి చేయాలనే...
అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై సీఎం ఇచ్చిన వివరణలు కేంద్రానికి ఇచ్చామని తెలిపారు. పోలవరం త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చు పెట్టి రీఎంబర్స్ మెంట్ అడుగుతోందని తెలిపారు.
కరోనా కారణంగా నిధుల విడుదలలో కొంత ఆలస్యం ఉందని చెప్పారని మంత్రి బుగ్గన తెలిపారు.
గత టీడీపీ సర్కారు వల్లే అయోమయం..
ఏపీ విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటు నిధులతో కొత్త ప్రాజెక్టులకు ఉపయోగిస్తామని చెప్పారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి పోలవరం నిధులను విడుదల చేయాలని అడుగుతామని బుగ్గన తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను వదిలిపెట్టి ప్యాకేజీకి మార్చుకుందని, ప్యాకేజీలో స్పష్టత లేక ఈఏపీ నిధులు అంటూ అయోమయాన్ని సృష్టించిందన్నారు. కాగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా మంత్రి బుగ్గన కలిశారు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, నీతి అయోగ్ అధికారులను బుగ్గన రాజేంద్రనాథ్ కలవనున్నారు. బుగ్గన వెంట ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లాం, ఆర్థిక కార్యదర్శి రావత్, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు.