బీజేపీతో భేటీపై ట్విస్ట్: టీడీపీ నేతలపై బుగ్గన సభా హక్కుల నోటీసు, రాజీనామాలకు సవాల్
అమరావతి: ఢిల్లీలో బీజేపీ నేతలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ కావడంపై ఇటీవల చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు దీనిపై విమర్శలు గుప్పించారు. ఈ అంశం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.
Recommended Video
తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పైన బుగ్గన సభా హక్కుల నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వారు ఆరోపణలు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుగ్గన అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు కాపీని పంపించారు.
టీడీపీకి బుగ్గన సవాల్
సభా హక్కుల ఉల్లంఘన నోటీసు పంపిన బుగ్గన టీడీపీకి సవాల్ కూడా విసిరారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకుంటే రాజీనామాలకు సిద్ధమా అని సవాల్ చేశారు. టీడీపీ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
వైసీపీకి, బీజేపీతో సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. టీడీపీపై మాపై బురద జల్లుతూ బీజేపీతో అంటకాగుతోందన్నారు. టీడీపీ అభియోగాలపై తేల్చుకోవడానికి ఎమ్మెల్యే, పీఏసీ పదవులను వదిలేసేందుకు సిద్ధమని సవాల్ చేశారు. టీడీపీ సిద్ధంగా ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు.