నవ్వుకుంటున్నారు బాబూ! ఆ వ్యాపారం మానుకో.. పవన్! ఇలాగైతే ఎలా?: ఏకేసిన బుగ్గన
హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టని చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ దురదృష్టమని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
బాబూ ఆ వ్యాపారం మానెయ్
చంద్రబాబు అబద్ధాల వల్లే రాష్ట్రానకి వచ్చిన నిధులు వెనక్కి పోతున్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం మానుకోవాలని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
కమీషన్ల కోసం బాబు ఇలా
ప్రత్యేక హోదా కావాలని తాము అడిగితే.. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పారని అన్నారు. ఇక పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని విభజన చట్టంలో ఉంటే కమీషన్ల కోసం చంద్రబాబు పోలవరం పనులు చేపట్టారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సహా దేన్నీ పట్టించుకోలేదన్నారు.
Recommended Video
మోసం చేస్తూ డ్రామాలు
అంతేగాక, రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారని చంద్రబాబుపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తూ ఇప్పుడు డ్రామాలాడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తాము చెప్పినా పట్టించుకోలేదని, ఇంకా తమపైనే విమర్శలు చేశారని మండిపడ్డారు.
ప్రజలు నవ్వుకుంటున్నారు
ఢిల్లీలో టీడీపీ ఎంపీల వేశాలు చూసి తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు. వారి ప్రవర్తనతో తెలుగు జాతికి మాయని మచ్చ తెస్తున్నారని మండిపడ్డారు. డ్రామాలు, గుండు గీయించుకోవడాలు మాని.. రాష్ట్రానికి ఏం కావాలో డిమాండ్ చేయాలని అన్నారు. లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జీడీపీపై బాబు చెప్పేవాన్ని అబద్ధాలేనని అన్నారు.
పవన్ను నమ్మెదెలా?
టీడీపీ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడు తప్పుకున్నారో చెప్పాలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ ఇంకా టీడీపీతో కలిసే ఉన్నారని తాము అనుకుంటున్నామని చెప్పారు. అనంతపురంలో టీడీపీ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరించారు. అనంతపురం జిల్లా గురించి తెలుసుకోవాలంటే జిల్లా కలెక్టర్ను అడిగితే వివరాలు చెబుతారు కదా? అని ప్రశ్నించారు. అసలు పవన్ కళ్యాన్ ఎజెండా ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. టీడీపీ నుంచి బయటికి వస్తే పవన్ గురించి ఆలోచిస్తామని, పవన్ ఏర్పాటు చేసే జేఏసీలో ముందు టీడీపీ చేరాలని అన్నారు.