జగన్ ఆనాడే చెప్పారు! చంద్రబాబు మాటలతో పరువుపోతోంది: బుగ్గన నిప్పులు
హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు, టీడీపీ వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయని అన్నారు.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి ఆర్థిక సంఘానికి రిపోర్టు ఇవ్వడంపై ట్ల బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా ఇవ్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరడం విడ్డూరంగా ఉందన్నారు.
జగన్ ఆనాడే చెప్పారు..
తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడే ఏపీకి ప్యాకేజీ ఒప్పుకోవద్దని టీడీపీ ప్రభుత్వానికి సూచిస్తే.. మగ బిడ్డను కంటానని అంటే అత్తయినా వద్దంటుందా? అన్న మాటలను మర్చిపోయారా? అని చంద్రబాబు, టీడీపీ నేతలకు బుగ్గన చురకలంటించారు.
అప్పుడేమో ప్యాకేజీ ముద్దన్నారు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటలను లెక్కలు చేయకుండా హోదా వద్దు.. ప్యాకేజీనే ముద్దు అంటూ చంద్రబాబు తీర్మానాలు ప్రవేశపెట్టారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి పెరుగుదలలో ఉందని అబద్ధాలు చెబుతున్నారని, వాస్తవానికి రాయలసీమలో సాగు దెబ్బతిందని వివరించారు.
బాబు మాటలతో పరువుపోతోంది..
పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని బుగ్గన మండిపడ్డారు. పరిశ్రమ రంగం, సేవా రంగం పడిపోయాయని.. అయినా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు మాటలతో రాష్ట్రం పరువుపోతోందని ధ్వజమెత్తారు.
గొప్పలు చెప్పి అప్పులపాలు చేశారు..
గొప్పలు చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని బుగ్గన ధ్వజమెత్తారు. రాజధాని కట్టడానికి లక్షకోట్లు అవుతాయని గతంలో చెప్పిన చంద్రబాబే.. ఇప్పుడు 2వేల కోట్లు ఇస్తే చాలు ఆనడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. ఒలింపిక్స్ అమరావతిలో జరుపుతామని.. గెలిచిన వాళ్లకు నోబెల్ ప్రైజ్ ఇస్తామని చంద్రబాబు చెప్పడం.. ఆయనకు ఉన్న అవగాహన ఎంటో చెబుతున్నాయని అన్నారు.