రేవంత్ వాడినవే: చంద్రబాబు దుమ్ముదులిపిన బుగ్గన, బ్లాక్మనీ వివరాలపై ఫైర్
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలన పక్కన పెట్టి దోమలపై దండయాత్ర, ఈగలపై యుద్ధాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం పదవికి చంద్రబాబు చెడ్డపేరు తెస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మధ్య చంద్రబాబు మాటల్లో వైరాగ్యం కనిపిస్తోందన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి వాడినవి రూ.500 నోట్లు కావడం వల్లే ఇంత వైరాగ్యం వచ్చినట్లుగా ఉందన్నారు.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు విషయం సరేగానీ, లంచగొండితనం, అవినీతి గురించి కూడా మాట్లాడాలన్నారు. నల్లధనం అంశంపై ప్రధాని మోడీకి ఉత్తరం రాయాలనుకుంటున్నారు కానీ తమ నాయకుడు జగన్ ఇప్పటికే లేఖ రాశారన్నారు.
నల్లధనం వెల్లడి పథకం గురించి వివరాలను బయటకు వెల్లడించమని సీబీడీటీ స్పష్టంగా చెప్పిందని, కానీ చంద్రబాబు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.13వేల కోట్లు బయటపడ్డాయని, అందులో రూ.10వేల కోట్లు బయటపెట్టినట్లు చెప్పారన్నారు.
సీబీడీటీ పేర్లు, ప్రాంతాలు, రాష్ట్రాలు చెప్పకుండానే చంద్రబాబుకు ఆ వివరాలు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా పేర్లు బయటకు చెబితే వాటిని నమ్మవద్దని, అవి మోసపూరితమని సీటీడీబీ చెప్పిందని, కేంద్రం ఇంత కచ్చితంగా చెబుతుంటే చంద్రబాబు ఎలా చెబుతున్నారని నిలదీశారు.
ఆ నల్లధనం ఎవరిదో.. అలా వెల్లడించిన వారికి తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రికి ఆ వివరాలు ఎలా తెలిశాయన్నారు. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఏపీలోనే ఉందని ఓ సర్వేలో తేలిన విషయం గుర్తుందా అని నిలదీశారు. ఏపీలో అవినీతిపై పుస్తకం వచ్చిందని, అందులో ఇసుక నుంచి పట్టీసీమ, రాజధాని వరకు అన్నీ ఉన్నాయన్నారు.
ముఖ్యమత్రి చెప్పిన రూ.పదివేల కోట్లు వెల్లడించిన వ్యక్తి ఎవరో బయట పెట్టాలని తాము ప్రధాని మోడీని కోరుతున్నామని చెప్పారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే భాస్కరాచార్యులు సున్నాకు విలువలేదని శుశ్రూతుడు వైద్యానికి విలువ లేదని చెప్పినట్లుందని ఎద్దేవా చేశారు.
అమరావతి శంకుస్థాపనకు వందల కోట్లు ఖర్చు పెట్టారని, పట్టిసీమలో పంపులు బిగించి వదిలేశారన్నారు. చంద్రబాబు డబ్బుల విషయంలో లెక్కలు చెబుతున్నారని, అదంతా ఏమయిందని ప్రశ్నించారు. తానే హైదరాబాద్ కట్టానని చంద్రబాబు చెబుతున్నారని, మరి కులీ కుతుబ్ షా ఏం కావాలని అన్నారు.
ఐటీని తీసుకు వచ్చింది తానే అని చంద్రబాబు చెబుతుంటారని, కానీ ఈయనకు తెలిసేసరికి అది విదేశాల్లో ఎప్పడో ఉందన్నారు. సత్య నాదెళ్లకు, పీవీ సింధుకు తానే స్ఫూర్తి అంటారని, ప్రజలు ఇదంతా చూస్తుంటే చివరకు ఆయన క్రెడిబులిటి దెబ్బతినడంతో శాశ్వత నష్టం జరుగుతుందన్నారు.
ఈ మధ్య చంద్రబాబు మాట్లాడుతూ ఎక్కడ పుట్టాలో ఎంపిక చేసుకోలేమని, అలాంటి అవకాశముంటే తాను, వెంకయ్య అమెరికాలో పుట్టాలనుకునే వారమని అన్నారని బుగ్గన మండిపడ్డారు. ఎక్కడకు వెళ్లినా ఇక్కడి వారంతా తెలుగు గడ్డ పైన పుట్టాలనుకుంటారని చెప్పారు. కానీ చంద్రబాబు విరుద్ధమన్నారు.
చంద్రబాబు మాములు ప్రజలకు అర్థం కాకుండా మాట్లాడుతారన్నారు. జీడీపీ, జీఎస్డీపీ, ఎఫ్ఆర్బీఎం వంటి పదాలతో సామాన్యులకు అర్థం కాలేరన్నారు. ప్రతి దాంట్లో తాను ఇన్ఫెక్షన్ చేస్తానని చెబుతారని, కానీ అది ఏఈ లేదా డీఈ చేయాల్సిన పని అన్నారు. దానికి తాను వెళ్లానని గొప్పలు చెబుతారన్నారు.
2015-16లో జాతీయ స్థూల ఉత్పత్తి 7.5 శాతం పెరిగితే, ఏపీలో జీఎస్డీపీ 10.99 శాతం పెరిగిదంని చెబుతున్నారని, అదే కాలానికి కేంద్రానికి మొత్తం రాబడి 30 శాతం పెరిగితే మనకు మాత్రం 13 శాతమే పెరిగిందన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఆ మధ్య అమెరికా వర్సిటీ చంద్రబాబుకు పీహెచ్డి ఇచ్చిందని, కానీ అది మూతబడిందన్నారు.