బిల్డ్.. సోల్డ్... క్విడ్ ప్రోకో... వర్సిటీ భూములపై కన్ను, ప్రభుత్వ భూములను వదలరా..?
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ పాలన అవినీతికి పరాకాష్ట అని విమర్శించారు. ఇసుక, మద్యం పేరుతోనే గాక భూములను అమ్మి దోచుకుంటున్నారని మండిపడ్డారు. బిల్డ్ ఏపీ మాటున భారీ స్కెచ్ ఉందన్నారు. బుధవారం తణుకులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ వైఖరిని ఎండగట్టారు.
కొత్త పేర్లు
ఏపీ సీఎం జగన్ దోపిడీకి కొత్త పేర్లు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇసుక, మద్యం పేర్లతో దోచింది చాలడం లేదా అని ప్రశ్నించారు. కొత్తగా తెరపైకి బిల్డ్ ఏపీ మిషన్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. భూములను విక్రయిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. భూములను సేకరించాలే కానీ.. విక్రయించడం ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు.
భూములను అమ్ముతారా..?
బిల్డ్ ఏపీ మిషన్ పేరులో కూడా క్విడ్ ప్రోకో దాగి ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. బిల్డ్ సోల్డ్ పేరుతో క్విడ్ ప్రోకోకు పాల్పడుతారని దుయ్యబట్టారు. యూనివర్సిటీల భూములను విక్రయించడం సరికాదని అభిప్రాయపడ్డారు. లోకంలో ఎక్కడా లేని విధానాలను జగన్ సర్కార్ అందుబాటులోకి తీసుకొస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వ భూములను కూడా విక్రయిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
జానెడు జాగ
మిషన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రంలో జానెడు జాగ లేకుండా చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. మీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అని ఆయన నిలదీశారు. మీరు చేసే పనులన్నింటీని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుచేశారు. తగిన సమయంలో బుద్దిచెబుతారని చంద్రబాబు అన్నారు.
అప్పుడే ఎక్కువ
రాత్రి 8 గంటలు దాటితే రాష్ట్రంలో మందు దొరకడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. తర్వాతే ఎక్కువ మందు లభిస్తుందని చెప్పారు. లిమిటెడ్ బ్రాండ్ల వెనక మర్మమేమిటి అని చంద్రబాబు నిలదీశారు. ఇందులో జే ట్యాక్స్ పాత్ర ఉందని ఆరోపించారు. వారికి ముడుపులు అందుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఒక విభాగం కాదు.. అన్నింటీపై అవినీతి పేరుకుపోయిందని చంద్రబాబు చెప్పారు.