తిరుపతి విమానాశ్రయంలో కలకలం... కడప టీడీపీ నేత వద్ద 20 బుల్లెట్లు స్వాధీనం !
తిరుపతి: కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడి వద్ద పెద్ద సంఖ్యలో బుల్లెట్లు దొరకడం కలకలం రేపింది. తిరుపతి విమానాశ్రయంలో తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో.. ప్రతి ఒక్కరూ తమ వద్ద లైసెన్స్ ఉన్న తుపాకులు, బుల్లెట్లను పోలీసులకు అందజేయాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా- టీడీపీ నాయకుడి వద్ద ఒకేసారి 20 బుల్లెట్లు దొరకడం చర్చనీయాంశమైంది. ఆ నాయకుడి పేరు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ. కడప జిల్లాలోని కమలాపురం మండలం సింగిల్ విండో అధ్యక్షుడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కమలాపురం నుంచి పోటీ చేసిన పుత్తా నరసింహా రెడ్డి ముఖ్య అనుచరుడు.
తిరుపతి విమానాశ్రయంలో తనిఖీల సందర్భంగా సాయినాథ్ శర్మ వద్ద 20 తూటాలు లభించాయి. దీనితో విమానాశ్రయం భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. విచారణ చేపట్టాయి. రేణిగుంట విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ విమానంలో ఆయన హైదరాబాద్ కు బయలుదేరాల్సి ఉంది. ఆ సమయంలో స్పైస్ జెట్ విమాన సిబ్బంది సాయినాథ్ శర్మ బ్యాగులను తనిఖీ చేయగా.. బుల్లెట్లు కనిపించాయి. వెంటనే వారు కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది (సీఐఎస్ఎఫ్) సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సాయినాథ్ శర్మ లైసెన్స్డ్ గన్ను పోలీసులకు డిపాజిట్ చేయలేదని తెలుస్తోంది. సాయినాథ్ శర్మ వద్ద లైసెన్స్డ్ తుపాకీ ఉంది. వచ్చే నెల 3వ తేదీన దీని కాల పరిమితి ముగుస్తుంది. అనంతరం రెన్యూవల్ కోసం కడప జిల్లా ఎస్పీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యూవల్ కోసం దరఖాస్తుతో పాటు గన్ ను కూడా డిపాజిట్ చేయాలి. బుల్లెట్లను కూడా స్వాధీనం చేయాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా సాయినాథ్ శర్మ ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
ఆయుధ లైసెన్స్ ఉన్నప్పటికీ, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి బుల్లెట్లు కలిగి ఉండటం నేరమని రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. సాయినాథ్ శర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అన్నారు. ఈ విషయంపై సాయినాథ్ స్పందించారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పారు. తాను తప్పు చేయలేదని, బుల్లెట్లను తీసుకోవడానికి పోలీసులే నిరాకరించారని, బుల్లెట్లు ఉంటే ఇబ్బందేమీ లేదని చెప్పడం వల్ల వాటిని తన వెంటే ఉంచుకున్నానని అంటున్నారు.