ఏపీకి బురేవి ఫీవర్: నివర్ నుండి గట్టెక్కక ముందే ముంచుకొస్తున్న బురేవి
నివర్ తుఫాను నష్టం నుండి కోలుకోకముందే, మళ్ళీ విధ్వంసం సృష్టించడానికి బురేవి తుఫాను ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బురేవి తుఫానుగా మారడంతో దీని ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. నివర్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వారంలోపే బంగాళాఖాతంలో మరో తుఫాను ఇప్పుడు ఏపి పై దాడికి సిద్ధమైంది.
వరుస ప్రకృతి విపత్తులతో వణికిపోతున్న ఏపీ
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తాజాగా నివర్ తుఫాన్ చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలను వణికించింది. అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అక్టోబర్ లో వర్షాలు దెబ్బకు కుదేలైన అన్నదాతల మీద, మరో మారు నివర్ తన ప్రతాపం చూపించింది. ఇప్పుడు బురేవి తుఫాను కూడా దక్షిణ రాయలసీమ ప్రాంతం మీద ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
అసెంబ్లీలోనూ తుఫాను పంట నష్టంపై కొనసాగుతున్న రచ్చ
ఇప్పటికే ఏపీ అసెంబ్లీ లో తుఫానులు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు సంబంధించి పరిహారం విషయంపై రచ్చ కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. రైతుల సమస్యలపై చర్చను పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి విపత్తుల వల్ల కలుగుతున్న నష్టం పై చర్చించాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు రాత్రి ట్రింకోమలై వద్ద బురేవి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిస్తోంది. దీని ప్రభావం వల్ల బుధ ,గురు వారాలలో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
బురేవి తుఫాను ప్రభావం వల్ల ఏపీకి వాన గండం
బురేవి తుఫాను ప్రభావం వల్ల ఏపీకి వాన గండం పొంచి ఉంది . కేరళ ,తమిళనాడు ప్రాంతాల్లోని పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేరళలో 4 దక్షిణ జిల్లాలైన తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట , అలప్పుజ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలో ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీచేసిన జిల్లాలలో 24 గంటల్లో 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Recommended Video
కేరళ , తమిళనాడు మాత్రమే కాదు ఏపీలోనూ బురేవి ఎఫెక్ట్ .. అలెర్ట్ అయిన ఏపీ ప్రభుత్వం
ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలలో 24 గంటల్లో 6 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురవ వచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు . తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ,కేరళ ,లక్షద్వీప్ ,దక్షిణ తీర ఆంధ్ర ప్రదేశ్ ,దక్షిణ రాయలసీమ ప్రాంతాలలో కూడా తుఫాను ప్రభావం ఉన్నట్లుగా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రకృతి విపత్తులు కూడా ఏపీపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ విపత్తుల పరంపర కొనసాగుతుండడంతో సాధ్యమైనంత వరకూ అన్ని చర్యలు తీసుకుంటున్నామని , రైతులకు అండగా ఉన్నామని చెప్తుంది ఏపీ సర్కార్ .