'బర్గర్ బాయ్ లోకేష్ ట్విట్టర్లోనే, బయట చేతకాదు'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ బర్గర్ బాబు అని, కేవలం ట్విట్టర్కే పరిమితమని, ఆయనకు బయట మాట్లాడటానికి చేతకాదని తెలంగాణ రాష్ట్ర సమితి కరీంనగర్ శాసన సభ్యుడు గంగుల కమలాకర్ ఆదివారం ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ట్విట్టర్లో వ్యాఖ్యల చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకేష్కు కేసీఆర్ను విమర్శించే స్థాయి, నైతిక హక్కు లేదన్నారు. మీ తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓటరు లిస్టులో పేరు లేకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీ సభ్యత్వం కూడా అక్కడ లేదని ఎద్దేవా చేశారు.
హైదరాబాదులో సభ్యత్వం తీసుకున్నాడన్నారు. ఏ ప్రాంతం వ్యక్తో తెలియకుండా చంద్రబాబు ఉన్నాడన్నారు. వారిది అధికార దాహం తప్ప మరొకటి కాదన్నారు. కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు అతనికి లేదన్నారు. ట్విట్టర్ పోస్టులు బంద్ చేయాలని లేకుంటే జనం పిచ్చిపట్టిందనుకుంటారన్నారు.
రైతులు, తెలంగాణ ఉద్యమకారుల శవాల మీద ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మించారన్నారు. నిజంగానే వారికి ఇక్కడి రైతులు, తెలంగాణ అమరవీరుల పైన ప్రేమ ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను అమ్మి పరిహారం చెల్లిస్తే వారి చిత్తశుద్ధిని నమ్ముతామన్నారు.
తెలంగాణను కించపరిచారు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైనట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ పైన తెలంగాణ అడ్వోకేట్ జేఏసీ ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో గూండాల రాజ్యం నడుస్తోందంటూ లోకేష్ రెండు రోజుల కిందట ట్విట్టర్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారని, కేసీఆర్ను హిట్లర్గా అభివర్ణిస్తూ.. ప్రజాస్వామ్యయుతంగా ప్జలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కించపరిచారని, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని, అందుకు ఆయన పైన కేసు నమోదు చేయాలని వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా అడ్వోకేట్ జేఏసీ కో కన్వీనర్ మాట్లాడుతూ.. ప్రాణాలు అడ్డుపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్.. ఒక్కసారి తన తండ్రి చరిత్ర గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. విద్యార్థి నాయకుడిగా ఎస్వీ వర్సిటీలో గూండాయిజం చేసిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. తెలంగాణలో టీడీపీ పునాదులు కదులుతున్నాయని, దానిని లోకేష్ గుర్తిస్తే మంచిదన్నారు.