బస్సును ఢీకొట్టిన లారీలు: ఆరుగురు మృతి, కాసేపట్లో ఇంటికి చేరతానగా ప్రమాదం
విజయనగరం: జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయరహదారిపై కాశీ నుంచి వస్తోన్న యాత్రికుల బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. వీటిని మరో లారీ వెనకనుంచి వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు మృతి చెందారు.
కొద్ది గంటల్లో ఇంటికి చేరుకుంటారనగా లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆరుగురిని బలితీసుకుంది. ఈ ప్రమాదంలో బోల్తా పడిన బస్సు నుజ్జునుజ్జయింది. బస్సులో చిక్కుకున్న పది మంది ప్రయాణికులను పోలీసులు, సహాయక సిబ్బంది, అధికారులు బయటికి తీశారు.
ప్రమాద సమయంలో బస్సులు 42మంది ఉన్నట్లు తెలిసింది. కాగా, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా నర్సీపట్నంకు చెందిన వారిగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ప్రమాద ఘటనపై ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా జర్మనీలో ఉన్న ఆయన ప్రమాద ఘటనపై విజయనగరం జిల్లా ఎస్పీని ఫోనులో సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన సాయం అందించాలని ఆదేశించారు.