ప్రజలపై ఏపీ భారం! దోపిడీ గ్యాంగ్: జగన్పై వర్ల తీవ్ర వ్యాఖ్యలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన భారం పడనుంది. ఏడాదికి రూ.600 కోట్ల నష్టంతో నడుస్తున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రయాణీకుల ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని పైన మంత్రి శిద్దా రాఘవ రావు బుధవారం మాట్లాడారు.
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆర్టీసీ నిర్వహణపై విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమైంది. ఈ సమావేశానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తదితరులు హాజరయ్యారు.
సమావేశం అనంతరం మంత్రి శిద్దా మాట్లాడారు. ఆర్టీసీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించామన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆర్టీసీ ఏడాదికి రూ.600 కోట్ల నష్టంలో నడుస్తోందని, నష్టాల నుంచి గట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించామన్నారు.
మంగళగిరిలో ఎయిమ్స్: కామినేని హర్షం
గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపడంపై మంత్రి కామినేని శ్రీనివాస్ రావు హర్షం వ్యక్తం చేశారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటోందని, ఇందులో భాగంగానే ఎయిమ్స్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసిందన్నారు.
జగన్పై కామినేని, వర్ల నిప్పులు
ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేస్తున్న వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ పైన మంత్రి కామినేని శ్రీనివాస రావు, టిడిపి నేత వర్ల రామయ్య భగ్గుమన్నారు.
జగన్ దీక్ష ఉనికి కోసమేనని కామినేని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కావాలని మేం కూడా కోరుకుంటున్నామన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని తాము అడుగుతున్నామని చెప్పారు.
జగన్ దొంగ దీక్ష చేస్తున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. ఆయనది కొంగ జపమన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతకు అసలు అవగాహహనే లేదన్నారు. గుంటూరులోని నల్లపాడు దీక్షలో కూర్చున్నది దోపిడీ ముఠా, నేరస్తుల గ్యాంగ్ అని ధ్వజమెత్తారు.