బస్సుల నిర్వహణ సక్రమంగా ఉండాలి:సిఎం చంద్రబాబు;రాజధానిలో తొలి ఈ-బస్సు
అమరావతి:బస్సుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, ప్రమాద ప్రాంతాలను గుర్తించాలని ఆర్టీసి, రవాణా శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
పొరుగు రాష్ట్రం తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణీకుల భద్రత, రోడ్డుప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలూ వెంటనే తీసుకోవాలని సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.
అలాగే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను తక్షణమే గుర్తించి సరిచేయాలని ఆర్టీసి ఎమ్డి సురేంద్ర బాబు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రోడ్లు భవనాల శాఖ అధికారులను సిఎం చంద్రబాబు సూచించారు. ఆర్టీసి బస్సుల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవడంతో పాటు ఏవైనా సమస్యలుంటే వెంటనే మరమ్మతులు చేయాలంటూ సిఎం పలు సూచనలు చేశారు.
వీటితో పాటు గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలసి సిఎం చంద్రబాబు అన్నారు. ఆర్టీసి డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే ప్రజల్లో సైతం రహదారి భద్రతపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయం పై ప్రత్యేక దృష్టి సారించాలని సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
మరోవైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతి రోడ్లపై బుధవారం తొలి ఎలక్ట్రిక్ బస్సు పరుగులు తీసింది. గన్నవరం నుంచి తుళ్లూరు వరకు ఈ-బస్సును ప్రయోగాత్మకంగా నడిపించి చూశారు. డ్రైవర్ కాకుండా 39 మంది కూర్చునేందుకు వీలున్న ఈ ఈ-బస్సులో ఆర్టీసీ ప్రస్తుతం నడుపుతున్న గరుడ బస్ లో ఉండే సౌకర్యాలన్నీ ఉన్నాయి. సుమారు 3 గంటలపాటు చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ఏకధాటిగా పరుగులు తీయగల సత్తా ఈ-బస్సు సొంతమని అధికారులు చెబుతున్నారు.
ఈ బస్సును మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ సిబ్బంది కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిసింది. ఇవి కాలుష్య రహిత బస్సులు కావడంతో వీటి కొనుగోలుపై సహజం గానే అనేక రాష్ట్రాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తిరుపతి- తిరుమల నడుమ కూడా ఈ-బస్సును నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. రాజధాని ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు ఈ-బస్సుల వాడకాన్ని పెంచే దిశగా సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రాజధాని రోడ్లపై పరుగులు అనంతరం ఈ- బస్సును గన్నవరం ఆర్టీఏ అధికారులు పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేశారు.