వ్యాపారాలు కావాలి..రాజకీయాలూ కావాలి..! విలువలతో మాకేంటి పని అంటున్న టీడిపి ఎంపీలు..!!
అమరావతి/హైదరాబాద్ : నిన్నటి వరకూ పార్టీని అడ్డంపెట్టుకుని అందలం ఎక్కిన టీడిపి నేతలు ఇప్పుడు స్వలాభాలకోసం పార్టీని ఏకాకిని చేస్తున్నారు. ఏ పార్టీ నైతే అడ్డం పెట్టుకుని వ్యాపారాల్లో స్థిరపడ్డారో ఇప్పుడు అదే వ్యాపారాల కోసం పార్టీని వీడేందుకు రెఢీ అంటున్నారు. దీంతో వ్యాపారం - రాజకీయం వేరు వేరు కాదని, ఏది ముందు ఏది వెనుక అన్న తేడానే గాని... ప్రతి రాజకీయ నాయకుడికి వ్యాపారమే ముఖ్యమనే అంశం తేలిపోయింది. ఇదే వ్యవహారం ఇప్పుడు పార్టీల కొంప ముంచుతోంది. ఒకప్పుడు పార్టీకి ఆదాయం సమకూర్చేవాళ్లు వేరే ఉండగా రాజకీయ నాయకులు వారేగా ఉండే వాళ్లు. అందుకే పార్టీలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎలాంటి ఇబ్బంది పడేవారు కాదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చేసరికి పార్టీ ప్రయోజనాల కన్నా వ్యాపార ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో పార్టీ ఉన్నట్టుండి అగాదంలో పడిపోయే పరిస్తితులు తలెత్తుతున్నాయి.
వ్యాపారమయమైన రాజకీయాలు..! రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వ్యాపారాలు..!!
ప్రతి ఒక్కరికి అధికారం అండ తప్పనిసరి అయిపోయింది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో వ్యాపారాల్లో ఉన్న రాణిస్తున్న టీడీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. దీంతో పార్టీ నాయకులను కాపాడుకోవడం కూడా పార్టీకి కత్తిమీద సామవుతోంది. అధిక సీట్లు గెలవడంతో మంచోడు అనే పేరు తెచ్చుకుని జనాల్లో మార్కులు కొట్టేద్దామని జగన్ ఫిరాయింపులు దూరంగా పెట్టాడు. కానీ కేంద్రంలో లోక్ సభలో అధికారం నిండుగా ఉండి, రాజ్యసభలో మైనారిటీలో ఉన్న బీజేపీ టీడీపీపై కన్నేసింది. పార్లమెంటు సభ్యులు బీజేపీలోకి దూకడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు లోక్ సభ ఎంపీల్లో ఒకరు బీజేపీతో టచ్లో ఉన్నారని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
Recommended Video
పార్టీ ప్రయోజనాలకు తిలోదకాలు..! అదికారమే పరమావధి..!!
తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీ పట్ల ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. కర్మ ఏంటంటే... వారి వ్యాపారాలే దీనికి కారణం అవుతున్నాయి. టీడిపి కి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతోపాటు, కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. నలుగురు ఎంపీలతోపాటు గుంటూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లాకు చెందిన ఒక మాజీ ఎంపీ, కొందరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపిలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపిలో చేరతారని ప్రచారం జరుగుతున్న ఈ నాయకుల్లో ఎవరూ ఆ విషయాన్ని ఇంతవరకూ ధ్రువీకరించ లేదు. అలాగని తాము బీజేపిలో కి వెళ్లబోమని ఖండించడమూ లేదు.
మారుతున్న నేతల తీరు..! నైతిక విలువలకు పాతర..!!
బీజేపీ వారి వ్యాపారాలను చూపించి పరోక్షంగా బెదిరిస్తోంది. దీంతో వారు సంకటంలో పడ్డారు. జగన్ ను అడ్డం పెట్టుకునే రాష్ట్ర కేంద్ర అధికార దాహంతో బీజేపీ చెలరేగిపోతోంది. రాష్ట్రంలో సొంతంగా బలోపేతం కావాలని భావిస్తున్న బీజేపీ అందుకోసం టీడీపీని టార్గెట్ చేసింది. ఈ అయిదేళ్లు తమకు కష్టాలు తప్పవని టీడీపీ నాయకులకు ఇప్పటికే అర్థం కావడంతో తమ వ్యాపార ప్రయోజనాల రీత్యా పక్కదారి చూస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోస్తున్న బాబు..! అన్నీ సర్ధుకుంటాయని భరోసా..!!
టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేశ్ గురువారం బీజేపీలో చేరతారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం విదేశాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ సీనియర్, ముఖ్య నేతలతో ఆయన యూరప్ నుంచి ఫోన్ లో మాట్లాడారు. టీడీపీలో సంక్షోభాలు అన్నవి కొత్తవి కాదన్న చంద్రబాబు సూచించారు. కార్యకర్తలు, నేతలు ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో పోరాడామని బాబు గుర్తుచేశారు.