నమ్మిన వ్యక్తి కోసం కడదాక బాలకృష్ణ.. కోడెల విగ్రహానికి ఎంత ఖర్ఛున్నారో తెలుసా?
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద రావు విగ్రహం ఏర్పాటుకు కసరత్తు సాగుతోంది. రెండు అడుగుల ఎత్తు ఉండే కాంస్య విగ్రహం ఇప్పటికే సిద్ధమైంది. దానికి తుది రూపాన్ని ఇస్తున్నారు. జిల్లాలోని నత్త రామేశ్వరం వద్ద ఈ కాంస్య విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత అరుణ్ ప్రసాద్ ఉడయార్.. ఈ విగ్రహం తయారీకి అయ్యే ఖర్చును భరిస్తున్నారు. అయిదు లక్షల రూపాయలను దీనికోసం వ్యయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఇంకా నిర్ధారించలేదు. నరసరావుపేటలోని కోడెల నివాసం వద్ద గానీ, పార్టీ కార్యాలయం వద్ద లేదా పట్టణ సెంటర్ ఈ మూడు ప్రాంతాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు. పట్టణం సెంటర్ లో ఏర్పాటు చేయడంపై మెజారిటీ నాయకులు, కార్యకర్తలు మొగ్గు చూపుతున్నారు. దశదిన కర్మ నాటికి విగ్రహం ఆవిష్కరించవచ్చని తెలుస్తోంది.
కాగా- కోడెల భౌతిక కాయానికి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి. నరసరావుపేటలోని స్వర్గధామంలో కుమారుడు కోడెల శివరామ్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొనడానికి వేలాదిమంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు నరసరావుపేటకు చేరుకున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ దాదాపు అన్ని జిల్లాల నుంచీ ప్రత్యేక వాహనాల్లో టీడీపీ నాయకుల కోడెల అంత్యక్రియల కోసం తరలివచ్చారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత అచ్చెం నాయుడు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ సహా పలువురు పలువురు నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తమ సహచరుడికి తుది వీడ్కోలు పలికారు.
అంతిమ యాత్ర సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు తలెత్తే అవకాశం ఉందనే ఉద్దేశంతో జిల్లా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. నరసరావు పేట డివిజన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. వేలాదిమంది ఒకే చోట గుమికూడబోతుండటం, ఉద్విగ్న భరిత సందర్భం కావడం వల్ల రాజకీయంగా ప్రత్యర్థుల ఆస్తుల విధ్వంసానికి దిగే అవకాశం ఉండొచ్చనే అనుమానంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. కోడెల భౌతిక కాయానికి నిర్వహించిన అంతిమ యాత్ర సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి నివాసం సమీపం నుంచి అంతిమయాత్ర సాగే సమయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు సకాలంలో స్పందించారు.