కోట్ల చేరికపై బుట్టా రేణుక ఏమన్నారంటే, వైసీపీ నుంచి వచ్చిన ఆమెకు ఏమి ఆఫర్ చేస్తారు?
కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇరుకున పడ్డారు. కోట్ల టీడీపీలో చేరడానికి షరతులు పెడుతున్నారు. కర్నూలు లోకసభతో పాటు మరో రెండు మూడు అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారు. కర్నూలు లోకసభను అడగడం బుట్టా రేణుకకు మింగుడు పడటంలేదు.
చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని బుట్టా రేణుక
ఈ నేపథ్యంలో కోట్ల చేరికపై బుట్టా రేణుక మంగళవారం స్పందించారు. తాను తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపారు. పార్టీ అధనేత నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఆమెకు కర్నూలు లోకసభ స్థానంపై హామీ వచ్చిందా? లేక అసెంబ్లీకి వెళ్లాలని ఆమె భావిస్తూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారా? మరేమైనా హామీలు వచ్చాయా అనే చర్చ సాగుతోంది. లేదా కోట్ల ఇంకా పార్టీలో చేరలేదు.. పైగా కర్నూలును ఇంకా వారికి కేటాయించలేదు కాబట్టి ప్రస్తుతానికి అలా మాట్లాడుతున్నారా తెలియాల్సి ఉంది.
వైసీపీ వ్యూహం: వైవీ సుబ్బారెడ్డికి పీకే టీం షాక్, ఒంగోలు లోకసభ నుంచి షర్మిల? కారణాలెన్నో
ఆమెకు ఏమిస్తారు?
కోట్లకు కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు రానున్న ఎన్నికల్లో కర్నూలు లోకసభ స్థానం టీడీపీ ఇస్తున్నట్లు గతంలో మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనలో ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో బుట్టాకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఏదో ఒకటి ఇవ్వవచ్చుననే ప్రచారం సాగుతోంది. అయితే బుట్టా రేణుక కర్నూలు లోకసభ లేదంటే ఎమ్మిగనూరు అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారని కూడా ప్రచారం సాగుతోంది.
కేఈ, బుట్టాలకు అనుకూలంగా చంద్రబాబు వ్యవహరిస్తారు
కోట్ల చేరిక, వారి డిమాండ్లపై రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వేరుగా స్పందిస్తూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం వచ్చే వరకు మాట్లాడటం సరికాదని చెప్పారు. చంద్రబాబు అందరికి అనుకూల నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. కేఈ కృష్ణమూర్తి, బుట్టా రేణుకలకు అనుకూలంగా చంద్రబాబు వ్యవహరిస్తారని చెప్పారు.