వెంకయ్య మాట సరి కాదు: 'ప్రత్యేకత'పై రాఘవులు, కల్పిస్తామని సుజనా
న్యూఢిల్లీ/ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో కలిసిన పోలవరం ముంపు ప్రాంత ప్రజల సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. శనివారం నాడు ఢిల్లీలో సీపీఎం పొలిట్బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణం, భూసేకరణ బిల్లు, పార్టీ నాయకత్వం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాఘవులు ప్రసంగించారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం మంత్రి వెంకయ్య నాయుడు అనడం సరికాదన్నారు. పార్లమెంట్లో చట్టం చేసైనా సరే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తన విచక్షణాధికారంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవచ్చని సూచించారు. 14 ఆర్థిక సంఘం నివేదిక శిలాశాసనం కాదన్న ఆయన ఏపీకి ప్రత్యేక హోదాపై చట్టం చేస్తే కాంగ్రెస్, వామపక్షాలు ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు.
పార్లమెంటులో చట్టం చేసైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో సీపీఎం పొలిట్బ్యూరో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనాచౌదరి అన్నారు. శనివారం విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పర్యటించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.