తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం: బివి రాఘవులు
బిల్లులో ప్రతిపాదించిన అంశాలు కూడా మరిన్ని వేర్పాటువాద ఉద్యమానికి ఊతం ఇచ్చే విధంగా ఉన్నాయని రాఘవులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. బిల్లు వల్ల మరోసారి విభజన ఉద్యమాలు రావచ్చునని ఆయన అన్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆయన విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోరుతూ ఆందోళనా కార్యక్రమాలు చేపడుతామని రాఘవులు చెప్పారు. తెంలగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అస్పష్టంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో దాదాపు పది వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైందని ఆయన అన్నారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు గెజెట్ కాకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా తీర్పుపై పునరాలోచన జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
జ్యోతిబసు శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మతోన్మాద వ్యతిరేక ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 12వ తేదీన జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఆందోళనా కార్యక్రమాలను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.