రాజధానిగా కర్నూలు, హైదరాబాద్లా వద్దు: రాఘవులు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలును ప్రకటించాలనే డిమాండ్కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. తాజాగా సిపిఎం కూడా ఆ డిమాండ్కు మద్దతు ప్రకటించింది. రాష్ట్ర రాజధానిని కర్నూలులో నెలకొల్పాలన్న ప్రజల డిమాండ్లో న్యాయముందని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అబిప్రాయపడ్డారు. ఇప్పటికే జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, బిజెపి రాయలసీమ నాయకులు ఆ డిమాండ్కు మద్దతు ఇస్తున్నారు.
‘నవ్యాంధ్రప్రదేశ్-జిల్లా సమగ్రాభివృద్ధి'పై మంగళవారం కర్నూలులో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతమైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రాంతాల్లోని భూములు, ఇతర వనరులను వినియోగించుకుని ఒక్క రాజధానినే కాకుండా ఇతర పట్టణాలు, నగరాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు.
కోస్తాంధ్రాలో జనసాంద్రత ఎక్కువని, అక్కడ చదరపు కిలోమీటరు పరిధిలో సుమారు 300 మంది ఉండగా రాయలసీమలో 160 నుంచి 246 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. కర్నూలులో జన సాంద్రత తక్కువగా ఉందని వెల్లడించారు. ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టినా అది ఏకాభిప్రాయం ప్రకారం ఉండాలని సూచించారు.
హైదరాబాదు మాదిరి ఒక్క చోటే కాకుండా అన్ని పట్టణాలు, నగరాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు. రాయలసీమలో వెనుకబాటుతనాన్ని పోగొట్టాలంటే ప్రజల్లో చైతన్యం రావాల్సి ఉందన్నారు. నిరక్షరాస్యతను దూరం చేసుకుని ప్రభుత్వంపై పోరాటాలు చేస్తే తప్ప అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు.
రాయలసీమకు వరప్రసాదం లాంటి గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు.