2021లో ఉప ఎన్నికల కోసం వైఎస్ జగన్ భారీ స్కెచ్: పావులు కదుపుతున్నారంటోన్న వైసీపీ
అమరావతి: రాష్ట్ర అసెంబ్లీకి 2021లో ఉప ఎన్నికలు రానున్నాయా? ఈ దిశగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోందా? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై హైకోర్టు నుంచి ప్రతికూల తీర్పులు వెలువడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాకోర్టుల్లోనే తేల్చుకుంటాం అంటూ వైఎస్ఆర్సీపీ కీలక నేతలు చేస్తోన్న మాటల వెనుక అంతరార్థమేంటీ? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోన్న చర్చ ఇది. ప్రత్యేకించి- వైఎస్ఆర్సీపీ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది.
డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ తొలి వేటు: స్లో పాయిజన్: డాక్టర్పై: వైసీపీ సానుభూతిపరుడిగా
రాజీనామా చేస్తేనే..
కారణాలేమైనప్పటికీ.. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు శాసన సభ్యులు అధికార పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. ఇదివరకే టీడీపీకి చెందిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్బై చెప్పారు. వల్లభనేని వంశీ గత ఏడాది అక్టోబర్లో తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కు అందజేశారు. స్పీకర్ దాన్ని ఇంకా ఆమోదించాల్సి ఉంది.
వంశీ బాటలో మరికొందరు..
ఒక్కసారి ఆమోదించడమంటూ జరిగితే ఆరు నెలల్లోగా ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేనందున వల్లభనేని వంశీ రాజీనామా పత్రాన్ని పెండింగ్లో పెట్టారు. సభలో ఆయనను ప్రత్యేక సభ్యునిగా గుర్తిస్తున్నారు. టీడీపీకే చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సైతం తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అదే జిల్లాకు చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయిదు నుంచి ఏడుమంది
దీనికోసం ఆయన ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డితో సమావేశం అయ్యారు. ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా వైసీపీలో చేరుతారంటూ వార్తలు వెలువడ్డాయి. ఆయన దాన్ని తోసిపుచ్చారు. తాను వైసీపీలోకి చేరబోవట్లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అదే జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్ సహా వివిధ జిల్లాల నుంచి గెలుపొాందిన కనీసం అయిదు నుంచి ఏడుమంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది నిర్వివాదాంశం
మూకుమ్మడిగా రాజీనామాలు.. ఒకేసారి ఆమోదం.. ఉప ఎన్నికలు
వైఎస్ఆర్సీపీలోకి చేరాలంటే తమ పదవులకు రాజీనామా చేయాలనే షరతు ఉంది. దీనికి అనుగుణంగా వైసీపీలోకి చేరాలనుకునే టీడీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాల్సి ఉంటుంది. తమ పార్టీలోకి చేరదలచుకున్న వారందరితో మూకుమ్మడిగా రాజీనామాలను చేయించి, వల్లభనేని వంశీ రాజీనామాతో సహా వాటన్నంటినీ ఒకేసారి ఆమోదించడం, తద్వారా ఉప ఎన్నికలకు వెళ్లాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహమని తెలుస్తోంది.
అయిదు రాష్ట్రాలతో పాటు
వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ సహా పుదుచ్చేరి అసెంబ్లీ కాల వ్యవధి 2021లో ముగుస్తుంది. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఈలోగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరబోయే ఎమ్మెల్యేలతో రాజీనామాను చేయించి, ఉప ఎన్నికలకు వెళితే బాగుంటుందనే అభిప్రాయం వైసీపీ కీలక నేతల్లో వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ప్రజాకోర్టుల్లోనే తేల్చుకోవడానికి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న కీలక నిర్ణయాలు, విడుదల చేస్తోన్న జీవోలపై హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అధికార పార్టీకి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన వంటి కొన్ని నిర్ణయాలను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అలాంటి వాటిపైన కూడా హైకోర్టులో చుక్కెదురు కావడం, ఈ తీర్పులు కాస్తా రాజకీయ రంగును పులుముకోవడం, దీని వెనుక తెలుగుదేశం పార్టీ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తడం ప్రస్తుతం చోటుచేసుకుంటోన్న పరిణామాలు. అందుకే-ప్రజా కోర్టుల్లోనే తేల్చుకుంటామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేయడానికి టీడీపీలో మారుతున్న సమీకరణాలే కారణమని అంటున్నారు.