ఉపఎన్నికలు వస్తున్నాయి...తడాఖా చూపిస్తాం:చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
అమరావతి: శుక్రవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపికి ప్రత్యేక హోదా నినాదంతో వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు జూన్ 2 తర్వాత ఆమోదించే అవకాశం ఉందని తెలిసిందన్నారు.
తనకు అందిన సమాచారం ప్రకారం వైసీపీ ఎంపీల రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఆమోదిస్తారని, రాష్ట్రంలో ఐదు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ఆయన తమ పార్టీ నేతలతో చెప్పారు. అయితే ఆ విధంగా జరిగి ఉప ఎన్నికలు వస్తే తడాఖా చూపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలన్నారు. తెలంగాణలో ఒక సారి 25 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే మనం ఏడు సీట్లు గెలుచుకున్నామని చంద్రబాబు గుర్తుచేశారు.
మరోవైపు వైసీపీ, బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, కర్ణాటకలో ఎన్జీవో నేత అశోక్బాబుపై దాడి చేసింది వైసీపీ వారేనని సిఎం చంద్రబాబు ఆరోపించారు. వీరిద్దరూ కలిసి రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారని, అరాచకం సృష్టించాలని చూస్తున్నారన్నారు. ప్రజలకు అన్ని విషయాలను తెలపాల్సిన సమయం ఆసన్నమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బిజెపి, వైసిపి కలిపి పన్నుతున్న కుట్రల గురించి పెద్దయెత్తున ప్రచారం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. భారత దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రాఫ్ అంతకంతకూ తగ్గిపోతుందని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మాలించామని, ఎక్కడైనా తిరిగి ప్రారంభించినా నేతలే తొలగించాలని చంద్రబాబు సూచించారు.
ఈ సమావేశం సందర్భంగా టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ పై పంచ్ లు డైలాగులు వేశారు. మురళీ మోహన్ ఒక మంచి నటుడని, సినీ నిర్మాత అని, కానీ ఆయన పార్టీకి మాత్రం సరిగా ఉపయోగపడటం లేదని చంద్రబాబు సెటైర్ వేశారు. దీనిపై స్పందించిన మురళీ మోహన్ ఎంపీగా తన సమయం సరిపోవడం లేదని బదులిచ్చారు.