ప్రత్యేక సీమ ఉద్యమ నేత బైరెడ్డి! జగన్ పార్టీ వైపు చూస్తున్నారా?
విజయవాడ: రాయలసీమ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమం చేసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. రాయలసీమ అభివృద్ధి కోసం నిరసనలు, ఆందోళనలు చేపట్టిన ఆయన, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం.
ఓ వైపు ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తూనే సీమ అభివృద్ధి కోసం రాజకీయం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీమపై వివక్ష చూపిస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు.
2014 ఎన్నికల ముందర సీమజిల్లాలలో చేపట్టిన ట్రాక్టర్ యాత్ర, పాదయాత్రలో కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరిగారు బైరెడ్డి.. తెలంగాణతో పాటు రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని నినదించారు. ప్రస్తుతం సీమ అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. అంతేగాక, బైరెడ్డి బస్సుయాత్రకు కూడా శ్రీకారం చుట్టారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మూసాన్పల్లి గ్రామంలో జన్మించిన మహాయోగి లక్ష్మమ్మ అవ్వ దేవస్థానం నుంచి బస్సుయాత్రను ఆయన ప్రారంభించారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో దాదాపు మూడు నెలలపాటు యాత్ర కొనసాగేలా ప్రణాళిక రచించారు.
అయితే, గత డిసెంబర్ నెలలో బస్సుయాత్ర మొదలుపెడతానని అప్పట్లో బైరెడ్డి పలుమార్లు తెలిపారు. ఆ తర్వాత ఏవో కారణాలతో ఆ యాత్రను ఫిబ్రవరి 14న బస్సు యాత్ర చేపట్టారు. సీమ మేలుకొలుపు బస్సుయాత్రకు పొలిటికల్ పార్టీలు, నాయకుల నుంచి మద్దతు లభించినా లభించకపోయినా... రైతులు, యువకుల మద్దతు కూడగట్టుకుని ప్రజాపోరాట క్షేత్రంలోకి అడుగుపెట్టాలన్నది బైరెడ్డి లక్ష్యంగా తెలుస్తోంది. అదే లక్ష్యంతో ఆయన బస్సుయాత్రని కొనసాగిస్తున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్లో ఏకైక ప్రాంతీయ పార్టీ అధినేత అయిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరేందుకు మొదట్లో ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఆ ప్రయత్నాలు కలిసి రాకపోవడంతో తన సొంత పార్టీపైనే బైరెడ్డి దృష్టిసారించారు.
ఈ క్రమంలోనే నిరసనలు, దీక్షల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డికి ఆయన సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పలువురు ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరగా.. బైరెడ్డి మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గానీ, ఇటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.