అఖిలప్రియపై బైరెడ్డి వివాదాస్పదం: సన్నపాపకు.. పెద్ద గౌను అంటూ!
జగన్-చంద్రబాబు ఇద్దరూ ఇద్దరేనని, అసలు శిల్పామోహన్ రెడ్డికి ఏం అర్హత ఉందని జగన్ గారు వైసీపీ టికెట్ ఇచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు.
నంద్యాల: కేసుల గొడవలు ఉండొద్దు.. అనుచరుల లాబీయింగ్ కు అడ్డుపడవద్దు.. ఎన్నికల్లో ఖర్చు చేసిందానికి పదింతలు మళ్లీ రాబట్టుకోవాలి. ప్రస్తుత రాజకీయాల్లో నేతల మైండ్ సెట్ ఇది. పరోక్షంగా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. రాజకీయాలు ఒక షేర్ మార్కెట్ మాదిరి మారిపోయాయని వ్యాఖ్యానించారు.
కాదనడానికి నువ్వెవరు?: శిల్పాపై అఖిలప్రియ నిప్పులు, పొత్తులపై..
శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన నంద్యాల రాజకీయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అఖిలప్రియ గారిని అడుగుతున్నా.. మీరు ఏ పార్టీ?.. నిజంగా మీరు తెలుగుదేశం పార్టీనా?, ఏమయ్యా మోహన్ రెడ్డీ..నువ్వు నిజంగా వైసీపీ నేతవా?.. ఏదీ నిజంకాదు. రేపొద్దున్న జెండాలు పారేస్తారు.. అంతా షేర్ మార్కెట్ మాదిరి తయారైంది' అంటూ బైరెడ్డి ఎద్దేవా చేశారు.
ఉపఎన్నిక నేపథ్యంలో.. ఊపిరి సలపని రీతిలో తయారైన మంత్రి అఖిలప్రియ గురించి బైరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయమ్మ అఖిల ప్రియకు చంద్రబాబునాయుడు గారు చాలా పెద్ద బాధ్యత పెట్టిండ్రు అని వ్యాఖ్యానించారు. ఆయమ్మకేమో పాపం.. సన్నపాపకు పెద్దగౌన్ తొడిగినాడు, ఇటు చంద్రబాబేమో పెద్ద పాప.. చిన్న గౌను తొడుక్కున్నాడు అని ఎద్దేవా చేశారు.
ఇక జగన్ గురించి ప్రస్తావిస్తూ.. మొన్ననే మోడీకి కాడకు పోయి ఆయన చెవిలో గుసగుసలాడి వచ్చినాడు.. మొత్తం మీద ఒకరి నుంచి ఒకరు తయారయ్యారని బైరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈరోజు పొద్దున ఫ్లైట్ కు చంద్రబాబు మోడీ వద్దకు వెళ్తే.. సాయంత్రం ఫ్లైట్ కు జగన్ మోడీ వద్దకు వెళ్తున్నారు.. అంతా మోడీ జపంలో పడిపోయినారని చెప్పుకొచ్చారు.
Recommended Video
జగన్-చంద్రబాబు ఇద్దరూ ఇద్దరేనని, అసలు శిల్పామోహన్ రెడ్డికి ఏం అర్హత ఉందని జగన్ గారు వైసీపీ టికెట్ ఇచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు. శిల్పా మోహన్ రెడ్డి రాయలసీమను బాగు చేస్తాడనా?.. మోహన్ రెడ్డికి టికెట్ ఎందుకిచ్చారు?.. బాగా పార్టీలు మారినందుకా? లేకపోతే సూట్ కేసుల నిండా డబ్బులు తెచ్చుకున్నందుకా? అంటూ బైరెడ్డి ఘాటు విమర్శలు చేశారు.