బైరెడ్డిని రమ్మన్న బాబు: టీడీపీలోకి మరో కీలక నేత, జగన్కు అలా దెబ్బమీద దెబ్బ
కర్నూలు/అమరావతి: తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన కీలక నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
చదవండి: ఊహించని ట్విస్ట్లు: బాబు వద్దకు బైరెడ్డి! జగన్ కోసం శ్రీదేవి వద్ద అనుచరుడి లాబీయింగ్
అనంతరం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తనను పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. టీడీపీలో చేరే విషయమై తాను కార్యకర్తలతో చర్చించి, ఆ తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. రాయలసీమలోని ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు.
చదవండి: జేసీ దుమారం, ఇక అంతేనా?: బాబు పక్కా ప్లాన్, మోడీపై ఆగ్రహంతోనే గుజరాత్కు దూరం
ఎమ్మెల్సీ ఎన్నికలపై
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై బైరెడ్డి స్పందించారు. ఈ ఎన్నికలు పెద్ద విషయం కాదన్నారు. తన సహచరుడిని ఎన్నికల బరిలోకి దించానని, ఆయనను పోటీలో ఉంచాలా లేదా అనే దానిపై చంద్రబాబుతో భేటీలో చర్చించలేదని చెప్పారు. తన వర్గంతో భేటీ అయ్యాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరే అవకాశం
తాను గతంలో 19 ఏళ్ల పాటు టీడీపీని మోశానని బైరెడ్డి చెప్పారు. అధికారంలో లేకున్నప్పటికీ పార్టీ కోసం పని చేశానని తెలిపారు. తాను టీడీపీలో చేరితే కొందరు వ్యతిరేకించడం, మరికొందరు సమర్థించడం సహజమే అన్నారు. సంక్రాంతి తర్వాత నిర్ణయం ఉంటుందని అభిప్రాయపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 854 అడుగులు నీరు ఉన్నప్పుడే కాల్వలకు నీటిని విడుదల చేయమని కోరినట్లు చెప్పారు.
ఎన్నికలకు ఏడాది ముందు మరో కీలక చేరిక
బైరెడ్డి వ్యాఖ్యలను బట్టి సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరే అవకాశాలే ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన తన అనుచరుడితో నామినేషన్ విత్ డ్రా చేయిస్తే కనుక కచ్చితంగా ఆయన టీడీపీలో చేరనున్నట్లే భావించవచ్చునని అంటున్నారు. బైరెడ్డి చేరికకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన చేరే అవకాశం కనిపిస్తోంది.
జగన్కు ఇలా షాక్
2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కర్నూలు జిల్లాలో సత్తా చాటింది. అయితే ఆ తర్వాత అఖిలప్రియ వంటి పలువురు నేతలు టీడీపీలో చేరారు. కిందిస్థాయి నాయకులు కూడా అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో కీలక నేత బైరెడ్డి టీడీపీలో చేరడం వైసీపీకి షాకే అంటున్నారు. టీడీపీ ఎంతగా బలం పుంజుకుంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో అంత నష్టం.