కోస్తాలో అయితే అక్కడే కూర్చుంటారు, రాయలసీమకైతే ఇలానా: బాబుపై బైరెడ్డి
కర్నూలు: కోస్తాలో వరదలు వస్తే అక్కడే కూర్చున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాయలసీమ కరువు పట్టడం లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి విమర్శించారు. పట్టిసీమతో రాయలసీమకు ఒరిగేదేమీలేదని ఆయన అన్నారు.
పట్టిసీమ తమకు వద్దని, తుంగభద్ర జలాలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్ట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాయలసీమలో రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
జగన్ ధర్నాలతో ఒరిగేదేమీ లేదు
ప్రత్యేక హోదా సాధించే వరకు కేంద్రంపై ఒత్తిడి కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నేత నేత బోండా ఉమా చెప్పారు. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే జగన్ ధర్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాని దృష్టికి ఎందుకు తేలేదని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని బోండా స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రానికి కొన్ని సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ధర్నాలు చేసినంత మాత్రాన ప్రజలకు ఒరిగేదేమి లేదని బోండా ఉమ అన్నారు.