వైసీపీ యూవజన విభాగం చీఫ్గా బైరెడ్డి: సోషల్ మీడియా కోసం నలుగురు
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. జులై 8,9 తేదీల్లో ప్లీనరీ నిర్వహించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్పులు చేసింది పార్టీ అగ్ర నాయకత్వం. మెజారిటీ అనుబంధ విభాగాలకు పాతవారినే కొనసాగించింది. దీనికి సంబంధించిన జాబితాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.
బైరెడ్డికి యూత్ వింగ్..
ఈ జాబితా ప్రకారం.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి యువజన విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీ స్పోర్ట్స్ అకాడమీ ఛైర్మన్గా పని చేస్తోన్నారు. ఆయన సొంత నియోజకవర్గం కర్నూలు జిల్లా నందికొట్కూరు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కావడం వల్ల 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఆ తరువాత పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు పదవుల పంపకాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీ స్పోర్ట్స్ అకాడమీ ఛైర్మన్గా అపాయింట్ చేశారు.
మహిళా విభాగానికి..
మహిళా విభాగం అధ్యక్షురాలిగా పోతుల సునీతను నియమించింది పార్టీ నాయకత్వం. ఆమె సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లా చీరాల. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. ఎమ్మెల్సీ కూడా. రెండేళ్ల కిందటే వైఎస్ఆర్సీపీలో చేరారు. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉందామెపై. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తరచూ విలేకరుల సమావేశాలను నిర్వహిస్తూ, పార్టీ, ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చేస్తోన్నారని, దీనికి ధీటుగా పోతుల సునీత స్పందించాల్సి ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
సోషల్ మీడియాకు నలుగురు..
అత్యంత కీలకమైన సోషల్ మీడియా విభాగానికి నలుగురు నియమితులయ్యారు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, కమలాపురానికి చెందిన పుత్తా శివశంకర్, చల్లా మధుసూధన్ రెడ్డి, నంద్యాలకు చెందిన పామిరెడ్డిగారి మధుసూధన్ రెడ్డిని నియమించినట్లు తెలిపింది. ఈ నలుగురూ రాష్ట్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగాన్ని అనుసంధానం చేస్తూ విస్తృతస్థాయి కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది.
కీలక విభాగాలకు..
విద్యార్థి విభాగం-పానుగంటి చైతన్య, రైత విభాగం-ఎంవీఎస్ నాగిరెడ్డి, బీసీ సెల్-జంగా కృష్ణమూర్తి, ఎస్టీ సెల్-మత్స్యరాస వెంకటలక్ష్మి, మెరజోత్ హనుమంత్ నాయక్, కార్మిక విభాగం-డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి, వాణిజ్య విభాగం-వెల్లంపల్లి శ్రీనివాస్, మైనారిటీ సెల్-హఫీజ్ ఖాన్, సాంస్కృతిక విభాగం-వంగపండు ఉష, క్రిస్టియన్ మైనారిటీ సెల్- ఫాదర్ బడ్డు బాలస్వామి, వైఎస్ఆర్టీఎఫ్-కల్పలత రెడ్డి, ఐటీ విభాగం-మేడపాటి వెంకట్, సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్-లేళ్ల అప్పిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ-డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.